ప్రపంచం మెచ్చేలా కుతుబ్షాహీ టూంబ్స్..!
ABN , First Publish Date - 2021-10-26T11:57:19+05:30 IST
కుతుబ్ షాహీ టూంబ్స్లో సోమవారం ఆగాఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో...
హైదరాబాద్ సిటీ : కుతుబ్ షాహీ టూంబ్స్లో సోమవారం ఆగాఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చారిత్రక కట్టడాల పరిరక్షణ వాక్ నిర్వహించారు. కులీకుతుబ్షా అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ, డిపార్టుమెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ, ఆగాఖాన్ ట్రస్ట్ ఒప్పందం ప్రకారం తొమ్మిదేళ్లుగా కుతుబ్షాహీ టూంబ్స్లోని తారామతి, అబ్దుల్లా కుతుబ్షా సమాధులతోపాటు, ఇతర వారసత్వ కట్టడాలను పునరుద్ధరిస్తున్న విషయాన్ని ప్రతినిధులు వెల్లడించారు. 20వ శతాబ్దంలో అబ్దుల్లా సమాధి పునర్నిర్మాణ సమయంలో డోమ్మీద నిర్మించిన సిమెంటు పూతను తొలగించి, కట్టడాన్ని పునరుద్ధరించినట్లు ట్రస్ట్ ప్రతినిధి రతీష్ తెలిపారు. సుల్తాన్ కులీ సమాధి ఆవరణలోని ప్రహరీతో పాటు హమామ్లోని గ్రానైట్ ఫ్లోర్ను, మహ్మద్ కుతుబ్షా సమాధి డోమ్ను పూర్తిగా పునరుద్ధరించినట్లు వివరించారు. బడీబౌలిలోని కట్టడం పూర్తిగా కూలిపోవడంతో పునర్నిర్మించినట్లు ఆగాఖాన్ ట్రస్టు అధికారులు తెలిపారు.