ప్రముఖ ప్రవాసీ రావి రాధాకృష్ణకు గల్ఫ్లో టీడీపీ పగ్గాలు!
ABN , First Publish Date - 2022-07-23T21:09:41+05:30 IST
పెద్ద సంఖ్యలో సగటు ప్రవాసీ కార్మికులు నివసిస్తున్న గల్ఫ్ దేశాలలో బలోపేతమయ్యేందుకు తెలుగుదేశం పార్టీ చురుగ్గా ప్రయత్నాలు చేస్తుంది. గల్ఫ్ లోని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, కువైత్, బహ్రెయిన్, ఖతర్, ఒమాన్ దేశాలలో పని చేస్తున్న సుమారు అయిదు లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రవాసీయులు..
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పెద్ద సంఖ్యలో సగటు ప్రవాసీ కార్మికులు నివసిస్తున్న గల్ఫ్ దేశాలలో బలోపేతమయ్యేందుకు తెలుగుదేశం పార్టీ చురుగ్గా ప్రయత్నాలు చేస్తుంది. గల్ఫ్ లోని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, కువైత్, బహ్రెయిన్, ఖతర్, ఒమాన్ దేశాలలో పని చేస్తున్న సుమారు అయిదు లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రవాసీయులు, అంతకంటే రెట్టింపు సంఖ్యలో స్వదేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పార్టీ వైపు నడిపించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్త రావి రాధాకృష్ణను.. గల్ఫ్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన ఇంజినీర్ రాధాకృష్ణ.. ప్రపంచంలోకెల్లా అగ్రగామి చమురు ఉత్పాదక సంస్థ అయిన ఆరంకోకు సుదీర్ఘ కాలంగా కంట్రాక్టర్గా, పారిశ్రామికవేత్తగా ఉన్నారు. సౌదీ అరేబియాలో విదేశీ పెట్టుబడిదారుడిగా ఉన్న ఏకైక తెలుగు వ్యక్తి రాధాకృష్ణ.. తెలుగు దేశం పార్టీకి వీరవిధేయుడు. సౌదీతో పాటు గల్ఫ్లోని ఇతర దేశాలలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ ఉంటారు. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి దీపిక పేరు కూడా ఒక దశలో పరిశీలనకు వచ్చింది.
కోనసీమ, రాయలసీమ జిల్లాలకు చెందిన లక్షలాది మంది ప్రవాసీయులున్న ఎడారి దేశాల్లో ఎన్నారైల ద్వారా మాతృభూమిలోని వారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే తన లక్ష్యమని రాధాకృష్ణ పెర్కోన్నారు. తనను గల్ఫ్ ప్రాంతానికి అధ్యక్షుడిగా నియమించినందుకు ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్, పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.