Army, Navy, Air Force : త్రివిధ దళాలకు నియామకాల్లో భారీ మార్పులకు రంగం సిద్ధం!

ABN , First Publish Date - 2022-05-28T18:03:09+05:30 IST

త్రివిధ దళాలకు నియామకాల్లో భారీ మార్పులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి

Army, Navy, Air Force :  త్రివిధ దళాలకు నియామకాల్లో భారీ మార్పులకు రంగం సిద్ధం!

న్యూఢిల్లీ : త్రివిధ దళాలకు నియామకాల్లో భారీ మార్పులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. టూర్ ఆఫ్ డ్యూటీ/అగ్నిపథ్ పథకం (Tour of Duty/Agneepath scheme)లో భాగంగా భారత సైన్యం, భారత నావికా దళం, భారత వాయు సేనలలో నియమితులయ్యే నూటికి నూరు శాతం మందిని నాలుగేళ్ళ తర్వాత విధుల నుంచి విడుదల చేయాలని, ఓ నెల తర్వాత వీరిలో 25 శాతం మందిని ఫుల్ సర్వీస్ (Full Service)కు తీసుకోవాలని ప్రతిపాదించారు. 


అత్యంత విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, టూర్ ఆఫ్ డ్యూటీ స్కీమ్ తుది రూపంపై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని కొత్త సలహాలు వచ్చాయి. వీటిపై కూడా చర్చ జరుగుతోంది. ఈ తుది రూపానికి త్వరలోనే ఆమోదం లభిస్తుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుంది. 


నూతనంగా నియమితులైనవారిలో కొందరిని శిక్షణ కాలంతోపాటు మూడేళ్ళ సర్వీస్ పూర్తయిన తర్వాత విడుదల చేయాలని ప్రారంభ ప్రతిపాదనలు చెప్తున్నాయి. ఐదేళ్ళ కాంట్రాక్చువల్ సర్వీస్ అనంతరం మరింత మందిని విడుదల చేసి, చివరికి దాదాపు 25 శాతం మందిని ఫుల్ సర్వీస్‌కు నియమించాలని తెలిపాయి. 


అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం, ఈ కొత్త పథకం ద్వారా నియమితులైన నూటికి నూరు శాతం మందిని నాలుగేళ్ళ సర్వీస్ అనంతరం విడుదల చేయాలి. ఆ తర్వాత దాదాపు 30 రోజుల అనంతరం వీరిలో 25 శాతం మందిని మళ్ళీ పిలిచి, కొత్త జాయినింగ్ డేట్‌తో సైనికులుగా నియమించాలి. వేతనాలు, పింఛన్లను నిర్ణయించడం కోసం అంతకుముందు వీరు పని చేసిన నాలుగేళ్ళ కాలాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. దీనివల్ల పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదా అవుతుందని అంచనా. 


ఆర్మీ మెడికల్ కార్ప్స్ వంటి సాంకేతిక స్వభావంగల ఉద్యోగాల్లో నియమితులైనవారికి ఈ నాలుగేళ్ళ కాంట్రాక్చువల్ సర్వీస్ విధానంలో నాలుగేళ్ళ తర్వాత విడుదల చేసే పద్ధతి  నుంచి మినహాయింపు ఇస్తారని సమాచారం. సాంకేతిక శిక్షణ పొందినవారిని నేరుగా పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ITI)ల నుంచి నియమించుకోవాలనే ప్రతిపాదన వచ్చిందని చెప్తున్నారు. దీనివల్ల వారి శిక్షణ కోసం సమయం ఆదా అవుతుందని చెప్తున్నారు. ఈ విషయంలో అధ్యయనం చేయాలని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. 


మిలిటరీలో దాదాపు రెండేళ్ళ నుంచి నియామకాలు జరగడం లేదు. దీంతో యువత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామకాలను తిరిగి ప్రారంభించేనాటికి తమ వయోపరిమితి మించిపోతుందని, వెంటనే నియామకాలు ప్రారంభించాలని హర్యానా, పంజాబ్ యువత ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2022-05-28T18:03:09+05:30 IST