జగనన్న గోరుముద్ద పథకం ఇకముందు రాష్ట్రంలో కొనసాగదు: రఘురామ
ABN , First Publish Date - 2022-01-14T20:41:56+05:30 IST
జగనన్న గోరుముద్ద పథకం ఇకముందు రాష్ట్రంలో కొనసాగదని ఎంపీ రఘురామ అన్నారు.
న్యూఢిల్లీ: జగనన్న గోరుముద్ద పథకం ఇకముందు రాష్ట్రంలో కొనసాగదని, ఈ విషయంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాను రాసిన లేఖకు స్పందించారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక రాష్ట్రంలో జగనన్న పథకాలను కొనసాగించలేరని, ఇతర మంత్రిత్వశాఖలు కూడా మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ బాటలో కొనసాగే అవకాశం ఉందన్నారు. టీడీపీ నేత చంద్రయ్యను చాలా దారుణంగా హత్య చేసారన్నారు.
సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్కు కులం తెలియదని, కేవలం మతం మాత్రమే తెలుసునని, దాన్ని ఆయన పలు సందర్భాల్లో బహిర్గతం చేసుకున్నారని రఘురామ అన్నారు. సునీల్ కుమార్ గురించి తాను వ్యక్తిగతంగా ఎటువంటి ప్రకటనలు చేయలేదన్నారు. సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్పై తాను ఇచ్చిన ప్రివిలేజ్ పిటిషన్పై బండి సంజయ్ వ్యవహారంలో స్పందిచినంత వేగంగా స్పీకర్ స్పందించాలన్నారు. తనపై జార్ఖండ్ వ్యక్తులతో హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై అన్ని వివరాలతో ప్రధానికి లేఖ రాస్తానన్నారు. రాజ్యాంగం ప్రకారం దేవాలయాలకు, చర్చిలకు ప్రభుత్వం నిధులు ఇవ్వొద్దన్నందుకు తాను క్రైస్తవ వ్యతిరేకినా? అని ప్రశ్నించారు. పోలీసు వ్వస్థను ప్రతిపక్ష నేతలను వేధించేందుకు, కేసులు పెట్టేందుకు వినియోగిస్తున్నారని రఘురామ విమర్శించారు.