జగన్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో రఘురామ మళ్లీ పిటిషన్
ABN , First Publish Date - 2021-10-08T00:30:32+05:30 IST
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్పై ఉన్న 11 ఛార్జ్ షీట్లు పై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, జగన్ బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరితగతిన జరిగేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. బుధవారం జగన్, విజయసాయి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు రిజిస్ర్టీ తిరస్కరించింది. సాంకేతిక కారణాలు, పూర్తి వివరాలు లేకపోవడం వల్లే తిరస్కరించింది. వారి బెయిల్ను రద్దుచేయాలని రఘురామరాజు గతంలో దాఖలుచేసిన పిటిషన్లను ఇటీవల హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆ కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టులో అప్పీలు పిటిషన్లు దాఖలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డి, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చారు. అయితే రిజిస్ట్రీ సాంకేతిక అభ్యంతరాలు లేవనెత్తి పిటిషన్లను తిరస్కరించింది. దీంతో సాంకేతిక లోపాలను సరిచేసి రఘురామ తిరిగి ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు.