కాంగ్రెస్‌ నాశనానికి రాహుల్, ప్రియాంక చాలు : యోగి ఆదిత్యనాథ్

ABN , First Publish Date - 2022-02-14T17:59:03+05:30 IST

‘బేకార్’ కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని, ఆ పార్టీకి వేసిన ఓట్లు వృథా అవుతాయని ఉత్తరాఖండ్ ప్రజలకు...

కాంగ్రెస్‌ నాశనానికి రాహుల్, ప్రియాంక చాలు : యోగి ఆదిత్యనాథ్

లక్నో : కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలునని, వేరొకరెవరూ అక్కర్లేదని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘బేకార్’ కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని ఉత్తరాఖండ్ ప్రజలను తాను కోరానని చెప్పారు.  ఆయన సోమవారం  ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 


ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం పంజాబ్‌లో మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో తనకు విభేదాలున్నట్లు యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను రాహుల్ గాంధీ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానని, అదేవిధంగా ఆయన కూడా తన కోసం అదేవిధంగా త్యాగం చేస్తారని చెప్పారు. తమ మధ్య విభేదాలేవీ లేవన్నారు. 


ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో సోమవారం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి అన్నాచెల్లెళ్ళు చాలునని, వేరొకరు ఎవరూ అక్కర్లేదని చెప్పారు. ‘బేకార్’ కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని, ఆ పార్టీకి వేసిన ఓట్లు వృథా అవుతాయని ఉత్తరాఖండ్ ప్రజలకు చెప్పానన్నారు. 


హిజాబ్ వివాదం గురించి మాట్లాడుతూ, పాఠశాలల్లో సరైన డ్రెస్ కోడ్ ఉండాలన్నారు. గజ్వా-ఏ-హింద్ కోసం వారు కంటున్న కలలు కయామత్ వరకు నెరవేరవని చెప్పారు. ఇది నవ భారతమని, ప్రపంచంలో గొప్ప ప్రజాదరణగల నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్న భారత దేశమని చెప్పారు. నవ భారతం రాజ్యాంగం ప్రకారం పని చేస్తోందని, షరియా ప్రకారం కాదని వివరించారు. ఈ నవ భారతంలో అందరికీ అభివృద్ధి అందుతుందని, ఎవరినీ బుజ్జగించేది లేదని తెలిపారు. అందరితో కలిసి, అందరి అభివృద్ధి అనే నినాదంతో. అందరి నమ్మకం, అందరి కృషితో తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. 


వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, ప్రాథమిక హక్కులు, నమ్మకాలను దేశంపైనా, వ్యవస్థలపైనా రుద్దలేమని చెప్పారు. కాషాయం ధరించాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రజలను, కార్యకర్తలను అడిగానా? అని ప్రశ్నించారు. తమకు నచ్చినదాన్ని ప్రజలు ధరిస్తారన్నారు. కానీ పాఠశాలల్లో మాత్రం డ్రెస్ కోడ్ ఉండాలన్నారు. ఇది పాఠశాలలు, వాటిలో క్రమశిక్షణలకు సంబంధించిన విషయమని చెప్పారు. వ్యక్తిగత నమ్మకాలు వేరని, వ్యవస్థల విషయానికి వచ్చేసరికి, వాటిలోని నియమ, నిబంధనలను అంగీకరించాలని చెప్పారు. దేశం విషయానికొచ్చేసరికి రాజ్యాంగాన్ని పాటించాలన్నారు. 


హిజాబ్ ధరించిన మహిళ దేశానికి ప్రధాన మంత్రి అవుతుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై యోగి స్పందిస్తూ, ప్రతి బాలిక, భారత దేశ బిడ్డ హక్కులు, స్వాతంత్ర్యం కోసమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్రిపుల్ తలాక్‌కు ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పారు. బాలికలకు న్యాయం చేయడం, వారిని గౌరవించడం, వారిని సాధికారులుగా తీర్చిదిద్దడం కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. షరియా ప్రకారం వ్యవస్థ నడవదని, కేవలం రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుస్తుందని, వ్యవస్థలో రాజ్యాంగం అమలైతే ప్రతి బాలికకు రక్షణ, గౌరవం లభిస్తాయని తెలిపారు. ప్రతి మహిళ స్వయం సమృద్ధతను సాధిస్తుందని చెప్పారు. 


Updated Date - 2022-02-14T17:59:03+05:30 IST