Padayatra: రాహుల్‌ పాదయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-09-04T15:41:18+05:30 IST

కన్నియాకుమారి నుండి ఈ నెల 7వ తేదీన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) చేపట్టదలచిన పాదయాత్రకు పార్టీ తరఫున పకడ్బందీ

Padayatra: రాహుల్‌ పాదయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు

చెన్నై, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కన్నియాకుమారి నుండి ఈ నెల 7వ తేదీన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) చేపట్టదలచిన పాదయాత్రకు పార్టీ తరఫున పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాదయాత్ర మార్గంలో రాహుల్‌ పలుచోట్ల స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రాహుల్‌ ఏడో తేదీ ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి చెన్నై చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు శ్రీపెరంబుదూరు వెళ్ళి అక్కడి రాజీవ్‌ స్మారకస్థలిని సందర్శించి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత చెన్నై చేరుకుని హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు కన్నియాకుమారి(Kanniyakumari)కి వెళతారు. ఆ తర్వాత ఆయన వివేకానంద స్మారక మండపం, తిరువళ్లువర్‌విగ్రహ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం గాంధీ మంటపాన్ని తిలకిస్తారు. ఆ తర్వాత ఆయన పాదయాత్ర(Padayatra)ను ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి కామరాజర్‌ మండపానికి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో రాహుల్‌, స్టాలిన్‌, ఇతర పార్టీల నేతలు పాల్గొంటారు. ఇక రాహుల్‌తోపాటు పాదయాత్రలో ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన 100 మంది పార్టీ కార్యకర్తలు, రాష్ట్రానికి చెందిన 300 మంది కార్యకర్తలు పాల్గొంటారు. ఈ యాత్రలో పాల్గొనే కార్యకర్తలకు గుర్తింపు కార్డులను కూడా అందజేయనున్నారు. రాహుల్‌ ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు సాయంత్రం మూడు గంటలపాటు పాదయాత్ర నిర్వహించనున్నారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి ప్రకటించారు. మొదటి రోజు సాయంత్రం అగస్తీశ్వరం వివేకానంద కళాశాల వరకూ ఆయన పాదయాత్ర చేస్తారు. రాత్రి ఆ కళాశాల అతిథిగృహంలో ఆయన బసచేయనున్నారు.మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు న్యాయవాది సుధా, కోయంబత్తూరు కార్పొరేషన్‌ కౌన్సిలర్‌ గాయత్రి, కోయంబత్తూరు(Coimbatore) యువజన కాంగ్రెస్‌ నిర్వాహకుడు మహమ్మద్‌ హరీఫ్‌ రాహుల్‌ పాదయాత్రలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు.

Updated Date - 2022-09-04T15:41:18+05:30 IST