రాహుల్‌పై 'పోక్సో' చట్టం కింద కేసు నమోదు చేయాలి: బీజేపీ

ABN , First Publish Date - 2021-08-04T21:10:51+05:30 IST

అత్యాచారం, హత్యకు గురైన నాంగల్ బాధితురాలి వివరాలను బయటపెట్టిన కాంగ్రెస్ మాజీ...

రాహుల్‌పై 'పోక్సో' చట్టం కింద కేసు నమోదు చేయాలి: బీజేపీ

న్యూఢిల్లీ: అత్యాచారం, హత్యకు గురైన నాంగల్ బాధితురాలి వివరాలను బయటపెట్టిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై 'పోక్సో' చట్టం కింద నేషనల్ కమిషనర్ ఆఫ్ ప్రొటక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. తన రాజకీయ ఎజెండా కోసమే రాహుల్ ఈ చర్యకు పాల్పడినట్టు ఆరోపించింది.


అత్యాచారం, హత్యకు గురైన మైనర్ బాలిక అంత్యక్రియులు ఆమె తల్లిదండ్రుల అనుమతి లేకుండానే ఓల్డ్ నంగల్ క్రిమిటోరియంలో గత ఆదివారం జరిగిన ఘటన సంచలనమైంది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ పరామర్శించారు. దీనిపై బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, మైనర్ బాలిక వివరాల వెల్లడి చేయకుండా నిషేధం ఉన్న జ్యువనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్ట్రన్ యాక్ట్‌లోని 74వ నిబంధనను రాహుల్ ఉల్లంఘించినట్టు ఆరోపించారు. పోక్సో చట్టం కింద రాహుల్‌పై ఎన్‌సీపీసీఆర్ చర్య తీసుకోవాలని, నోటీసు జారీ చేయాలని  ఆయన డిమాండ్ చేశారు. ఎవరూ వీఐపీ కాదని, రాహుల్ సైతం తన చర్యకు సమాధానం చెప్పాలని అన్నారు.


దీనికి ముందు, బాధితురాలి కుటుంబ సభ్యులను రాహుల్ పరామర్శించి తన సపోర్ట్ తప్పనిసరిగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను కలిసిన ఫోటోను రాహుల్ షేర్ చేశారు. కాగా, మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తల్లి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీలోని 302,376,506 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Updated Date - 2021-08-04T21:10:51+05:30 IST