రెండు భారతదేశాల మధ్య విభజన పెరుగుతోంది: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-02-03T01:07:11+05:30 IST

రైల్వే పరీక్షల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉద్యోగ కల్పన గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. ప్రతి రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది..

రెండు భారతదేశాల మధ్య విభజన పెరుగుతోంది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: భారతదేశాన్ని రెండు భారతదేశాలుగా వర్ణించారు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ. ఒకటి ధనవంతుల దేశం కాగా మరొకటి పేదల దేశమని, అయితే ఈ రెండు దేశాల మధ్య విభజన నానాటికీ పెరుగుతోందని ఆయన అన్నారు. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రాహుల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


‘‘మనకు రెండు భారతదేశాలు ఉన్నాయి. ఒకటి పూర్తిగా ధనవంతుల భారతదేశం. వీరికి వాస్తవానికి ప్రభుత్వం నుంచి నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం, ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం లేదు. వాళ్ల దగ్గర చాలా డబ్బు ఉంటుంది. అధికారం కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి వీరికి అన్ని సదుపాయాలు అందుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వమే వారి కోసం పని చేస్తోంది. ఇంకొక భారతదేశం పూర్తిగా పేద ప్రజలది. వీరికి ప్రభుత్వం నుంచి ఆపన్న హస్తం అందాలి. కానీ వీరి గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. మోదీ ప్రభుత్వ విధానాల వల్ల ఈ రెండు దేశాల మధ్య విభజన నానాటికీ పెరుగుతోంది. దేశంలోని 10 మంది ధనవంతుల వద్ద ఉన్న డబ్బు దేశంలోని 40 కోట్ల భారతీయుల ఆదాయంతో సమానం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.


ఇక బడ్జెట్‌లో రైతులు, నిరుద్యోగులు, పేద వర్గాల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘రైల్వే పరీక్షల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉద్యోగ కల్పన గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. ప్రతి రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది’’ అని రాహుల్ విమర్శించారు.

Updated Date - 2022-02-03T01:07:11+05:30 IST