పలు రైళ్లు రద్దు
ABN , First Publish Date - 2021-05-09T05:38:22+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా రైల్వే శాఖ ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న రైళ్లను రద్దు చేస్తోంది.
గుంటూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా రైల్వే శాఖ ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న రైళ్లను రద్దు చేస్తోంది. ఇప్పటికే పల్నాడు, డెల్టా, కాచీగూడ ఎక్స్ప్రెస్లు రద్దు కాగా తాజాగా లింగంపల్లి - విజయవాడ - లింగంపల్లి(ఇంటర్సిటీ) ఎక్స్ప్రెస్ని రద్దు చేసింది. దీంతో పాటే నరసాపూర్ - నాగర్సోల్(షిర్డీ) ఎక్స్ప్రెస్ కూడా రద్దు అయింది. అలానే వారంలో ఒక రోజు, రెండు రోజులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ - విశాఖపట్టణం ఏసీ ఎక్స్ప్రెస్, దురోంతో ఎక్స్ప్రెస్లకు కూడా ప్రయాణికుల ఆదరణ చాలా తక్కువగా ఉండటంతో వాటిని రద్దు చేసింది. ప్రస్తుతానికి ఇతర రాష్ట్రాలు/జిల్లాల నుంచి గుంటూరు మీదుగా నడిచే కొన్ని రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వాటిల్లో నరసాపూర్ - లింగంపల్లి, చెన్నై సెంట్రల్ - హైదరాబాద్, తిరుపతి - నారాయణాద్రి, భువనేశ్వర్ - సికింద్రాబాద్, కాకినాడ - భావనగర్, కాకినాడ - ఎల్టీటీ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. వీటితో పాటు కాజీపేట మార్గంలో గుంటూరు - సికింద్రాబాద్(గోల్కొండ), గుంటూరు - సికింద్రాబాద్(ఇంటర్సిటీ) రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లని నిలిపేయాల్సిందిగా రైల్వేబోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు రైల్వే అధికారులు వడపోత ప్రారంభించారు.