‘రైల్వే బ్రిడ్జి ఎత్తు పెంచాల్సిందే’

ABN , First Publish Date - 2021-10-24T05:05:18+05:30 IST

రైల్వే బ్రిడ్జిల ఎత్తు, వెడల్పు పెంచాల్సిందేనని రైతులు శనివారం పనులను అడ్డుకున్నారు.

‘రైల్వే బ్రిడ్జి ఎత్తు పెంచాల్సిందే’
నిరసన తెలుపుతున్న టీడీపీ, వైసీపీ నాయకులు, రైతులు

మద్దికెర, అక్టోబరు 23: రైల్వే బ్రిడ్జిల ఎత్తు, వెడల్పు పెంచాల్సిందేనని రైతులు శనివారం పనులను అడ్డుకున్నారు. ఎద్దుల బండ్లతో నిరసన వ్యక్తం చేసి రైల్వే పనులను అడ్డగించి 2గంటల పాటు పెద్దఎత్తున రాస్తారోకో చేయడంతో ప్రయాణికులకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. మద్దికెర గ్రామంలోని ప్రధాన బస్టాండ్‌ వద్ద నుంచి రైతులు ఎద్దుల బండ్లతో టీడీపీ, వైసీపీ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి రైల్వే పనులను అడ్డుకొని ప్రధాన బస్టాండ్‌ వద్ద రాస్తారోకో చేశారు. జడ్పీటీసీ మురళీధర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ, టీడీపీ జిల్లా కార్యదర్శి జమేదార్‌ రాజన్నయాదవ్‌, మాజీ ఎంపీపీ మల్లికార్జునయాదవ్‌, టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ కార్యదర్శి గూడూరు ధనుంజయుడు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు యాదవ్‌ మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జి అవతల 30వేల ఎకరాల వ్యవసాయ పొలం ఉందని తెలిపారు. రైతులు దిగుబడిని ఎలా తీసుకురావాలని ప్రశ్నించారు. రైల్వే బ్రిడ్జి 5మీటర్లు ఎత్తు, 3 మీటర్ల వెడల్పు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాంతంలో కేవలం వర్షాధార పంటలపై ఆధారపడి ఉన్నామన్నారు. ఇప్పుడు రైల్వే అధికారులు అభివృద్ధి పేరుతో అన్యాయం చేస్తే రైల్వే పనులు జరగనివ్వబోమని, అవసరమయితే కోర్టుకు కూడా వెళ్లుతామని తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేపట్టారు. తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీనారాయణ, రంగయ్య, గొర్రెల శివశంకర్‌, నెట్టికంటి నాగరాజు, కృష్ణాయాదవ్‌, వెంకటరామిరెడ్డి, రామాంజులు, ఎంపీటీసీ ఆంజనేయులు, రామకృష్ణ, పంచాయతీ సలహదారుడు అంజనేయుడు, మాజీ సర్పంచ్‌ కన్నప్ప, చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-24T05:05:18+05:30 IST