మరుగుదొడ్లో 140 బస్తాల రేషన్ బియ్యం నిల్వ
ABN , First Publish Date - 2022-06-26T05:27:41+05:30 IST
కు అనర్హమని కొందరు అక్రమార్కులు నిరూపించారు.
మహారాష్ట్రకు తరలించేందుకు అక్రమార్కుల ప్లాన్
సింగరేణి ప్యాసింజర్లో గుర్తించిన రైల్వే పోలీసులు
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, జూన్ 25: అగ్గి పుల్ల కుక్కపిల్ల సబ్బు బిల్ల కవితకు కాదేదీ అనర్హమని శ్రీశ్రీ రాస్తే.. ప్యాసింజర్ బోగి, మరుగుదొడ్డి కావేవీ బియ్య అక్రమ రవాణాకు అనర్హమని కొందరు అక్రమార్కులు నిరూపించారు. ఏకంగా 140 బస్తాల రేషన్ బియ్యాన్ని సింగరేణి ప్యాసింజర్ రైల్లో మహారాష్ట్రకు తరలించేందుకు విఫలయత్నం చేశారు. ఈసంఘటన కొత్తగూ డెంలో శనివారం కలకలం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించి కొత్తగూడెం రైల్వేస్టేషన్ (భద్రాచలం రోడ్) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శుక్రవారం మధ్యాహ్నం మహారాష్ట్ర బల్లార్ష నుంచి కొత్తగూడేనికి సింగరేణి ప్యాసింజర్ రైలు బయలుదేరింది. ఈ రైలు వరంగల్ దాటిన అనంతరం ఇంటికన్నె రైల్వేస్టేషన్ వద్ద ప్రయాణికులు దిగేందుకు రైలు రెండు నిమిషాలు ఆగింది. ఈ క్రమంలో ఇంటికన్నె రైల్వేస్టేషన్ రైల్వేప్లాట్ఫాం పై అక్కడక్కడ వేచి ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు రేషన్ బియ్యం బస్తాలను సింగరేణి ప్యాసింజర్ రైలు ఎక్కించారు. దీంతో ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం రైలులో ఉన్న మరి కొంతమంది ఆ బస్తాలను ప్యాసింజర్ రైలులోనే మూడు బోగీల్లో మరుగుదొడ్ల గదిలో నిల్వ చేశారు. జనరేటర్ రూంలో కొన్ని బస్తాలను నింపారు. ఐదు టన్నుల పై చిలుకు బియ్యం బస్తాలతో శుక్రవారం రాత్రి సింగరేణి ప్యాసింజర్ కొత్తగూడెం చేరుకుంది. అనంతరం స్టేషన్లో స్టేయింగ్ పాయింట్ వద్దకు ఆ రైలును అధికారులు రోజువారీలాగే ఉంచారు. దీంతో రైలులో ఉన్న బోగీలన్నింటికీ లాక్పడిపోయింది. సమాచారం తెలుసు కున్న ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు ప్యాసింజర్ రైలును క్షుణ్ణంగా పరిశీలించారు. తిరిగి శనివారం ఉదయం 5.45 గంటలకు కొత్తగూడెం నుంచి బల్లార్షకు బయలుదేరేందుకు సింగరేణి ప్యాసింజర్ రైలు రైల్వేప్లాట్ఫాంపైకి వచ్చింది. మరుగుదొడ్లలో బియ్యం నిల్వ చేశారని సమాచారం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ తన సిబ్బంది, జీఆర్పీ సిబ్బంది సహాయంతో బస్తాలను రైలులో నుంచి దించారు. అనంతరం బల్లార్షకు సింగరేణి ప్యాసింజర్ బయలుదేరి వెళ్లింది. ఈ సమాచారాన్ని కొత్తగూడెం తహసీల్దార్ పివి. రామకృష్ణకు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు చేరవేశారు. మేరకు తహసీల్దార్ రైల్వేస్టేషన్కు చేరుకుని ఆ బస్తాలకు పంచనామా చేసి సీజ్ చేశారు. ఈ సంఘటనలో బియ్యం బస్తాలను ఎవరు లోడ్ చేశారనే కోణంలో పూర్తిగా తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో కొ త్తగూడెం ఆర్పీఎఫ్ ఏఎస్ఐ కమలాకర్, సిబ్బంది రవీంద్రన్, పీవి. సర్వన్ లాల్, రాజన్న, అవస్థి, మమత, జీఆర్పీ కానిస్టేబుల్ అశోక్, శ్రీనివాస్, కళావతి, జావేద్, రాము పాల్గొన్నారు.