వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2021-04-24T05:00:27+05:30 IST

మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు, కొండాపురం మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది.

వర్ష బీభత్సం
కొండాపురంలో నేలకొరిగిన వరిపైరు

కాలిన ట్రాన్స్‌ఫార్మర్‌, నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు

విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం

కల్లాల్లో తడిసిన పసుపు పంట


ఉదయగిరి రూరల్‌, ఏప్రిల్‌ 23 : మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు,  వరికుంటపాడు, కొండాపురం మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. పిడుగుపాటుకు ఉదయగిరి బీసీ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్ధమవడంతోపాటు గండిపాళెం, దాసరిపల్లి ప్రాంతాల్లో తీగలపై చెట్ల కొమ్మలు పడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దుత్తలూరు మండలం ముత్తరాశిపల్లిలో ఇంటిపైకప్పు రేకులు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లిలో పిడుగుపాటుకు గెట్టిబోయిన రాజాకు చెందిన రెండు గేదెలు మృతి చెందాయి. కృష్ణారెడ్డిపల్లి, బిజ్జంపల్లి, కొత్తపల్లి, లింగంనేనిపల్లి, అయ్యవారిపల్లి, దేకూరుపల్లి గ్రామాల్లో కల్లాల్లో ఉన్న పసుపు పంట తడిసి ముద్దవడంతో రైతులు కన్నీటి పర్యాంతమవుతున్నారు. గండిపాళెం గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపాటుకు గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. వరికుంటపాడు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిని అంధకారం నెలకొంది. కొండాపురం మండలంలో వరి పంట నేలకొరిగింది. రాపూరు మండలం పెంచలకోనలోనూ భారీ వర్షం కురిసింది.


పిడుగుపాటుకు మహిళ మృతి


చేజర్ల, ఏప్రిల్‌ 23 : మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది.  ఈదురుగాలులకు భారీవృక్షాలతోపాటు చిత్తలూరు గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాలలో వరి దెబ్బతింది. మైపాటివారికండ్రిక గ్రామంలో మిరప చేలో ఉన్న మాలపాటి సంపూర్ణమ్మ (45) అనే మహిళ పిడుగుపాటుకు మృతి చెందింది.

అనంతసాగరం : మినగల్లు పంచాయతీ పరిధిలోని నల్లరాజుపాలెం పంట పొలాల్లో చెట్టుపై పిడుగుపడింది. ఆ సమయంలో రైతులు, పశువుల కాపరులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 



Updated Date - 2021-04-24T05:00:27+05:30 IST