పంటలకు వర్షం దెబ్బ

ABN , First Publish Date - 2022-10-08T05:45:37+05:30 IST

ఆరుగాలం కష్టపడ్డ అన్నదాతకు పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలతో నష్టం జరుగుతోంది.

పంటలకు వర్షం దెబ్బ
కన్నాపూర్‌లో నేలవాలిన వరి పంట

- తడుస్తున్న పత్తి  - నేలవాలిన వరిపంట

హుజూరాబాద్‌/శంకరపట్నం, అక్టోబరు 7: ఆరుగాలం కష్టపడ్డ అన్నదాతకు పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలతో నష్టం జరుగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి నల్లబారిపోతుండగా, పలు చోట్ల గింజ దశలో ఉన్న వరి పంట నేలవాలింది. ఖరీఫ్‌ మొదటి నుంచి వర్షాలు కురుస్తునే ఉండటంతో పత్తి పంట ఎర్రబడిపోతోంది. ప్రతి ఏటా హుజూరాబాద్‌ డివిజన్‌లో 88వేల ఎకరాల్లో వరి, 568ఎకరాల్లో మొక్కజొన్న, 24వేల ఎకరాల్లో పత్తి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో కురిసిన వర్షాలకు మొదట్లో పత్తి రైతులు విత్తనాలు విత్తారు. పెట్టుబడులు సైతం పెట్టి పంట దక్కించుకున్నారు. తీరా పత్తి కాయ పగులుతుండడంతో వర్షాలకు తడిచి ముద్దవుతోంది. అంతేకాకుండా వర్షాలకు పత్తి చేన్లల్లో నీరు నిలవడంతో పంట ఎర్రబారిపోతోంది. తడిసిన పత్తిని మార్కెట్లోకి తీసుకెళ్తే దళారులు పత్తి నల్లబారిందని, క్వింటాల్‌కు రూ. 2వేలు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. పత్తి ఏరిన కూలి కూడా రావడం లేదని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వర్షాలు కురిస్తే అప్పులు కాక తప్పదని పత్తి రైతులు అంటున్నారు. శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం కురిసిన అకాల వర్షాలకు వరి పంట నేలకొరిగింది. కన్నాపూర్‌, మెట్‌పల్లి, లింగాపూర్‌, గద్దపాక, కొత్తగట్టు తదితర గ్రామాల్లో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కోత దశలో ఉన్న వరి పంట నేలవాలిందని రైతులు పేర్కొంటున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు నష్టాన్ని మిగుల్చుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-10-08T05:45:37+05:30 IST