ముంబైలో వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2022-07-06T08:43:54+05:30 IST

కుండపోత వానతో ముంబై తడిసిముద్దవుతోంది. భారీ వర్షాలతో మంగళవారం ముంబై, సమీపంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

ముంబైలో వర్ష బీభత్సం

 పశ్చిమ కనుమల్లో కొన్నిచోట్ల రెండ్రోజులు అతి భారీ వర్షాలు

ముంబై, జూలై 5: కుండపోత వానతో ముంబై తడిసిముద్దవుతోంది. భారీ వర్షాలతో మంగళవారం ముంబై, సమీపంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నీరు నిలిచి.. రైల్‌, రోడ్‌ రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఐలాండ్‌ సిటీగా పిలుచుకునే దక్షిణ ముంబైలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో 9.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 11.5 సెం.మీ, 11.6 సెం.మీ. వాన కురిసింది. అయితే, మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మూడున్నర గంటల వ్యవధిలోనే దక్షిణ ముంబైలో 4.1 సెం.మీ., తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో 8.5 సెం.మీ., 5.5 సెం.మీ. వర్షం కురిసింది. పలుచోట్ల రైలు పట్టాలపై నీరు నిలిచి లోకల్‌ రైల్‌ సర్వీసులపై ప్రభావం పడింది. జన జీవనం స్తంభించింది.


రాయ్‌గఢ్‌ జిల్లాలో 23 సెం.మీ. వాన

మహారాష్ట్రలోని పలు జిల్లాల్లోనూ వరుణుడు ప్రభావం చూపుతున్నాడు. రానున్న 24 గంటల్లో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. రాయ్‌గఢ్‌ జిల్లాలో 24 గంటల వ్యవధిలో 23 సెం.మీ. వర్షం కురిసింది. ఇది ఆ జిల్లా వార్షిక సగటు వర్షపాతంలో 22 శాతం కావడం గమనార్హం. పశ్చిమ మహారాష్ట్రలోని ప్రసిద్ధ హిల్‌ స్టేషన్‌ మహాబలేశ్వర్‌లో 12.9 సెం.మీ. వాన పడింది. కొంకణ్‌ రీజియన్‌ను వానలు ముంచెత్తుతున్నాయి. ఈ ప్రభావంతో కోయినా డ్యామ్‌ నీటి మట్టం పెరుగుతోంది.  పశ్చిమ కనుమల్లోని కొన్ని ప్రాంతాల్లో రాగల రెండ్రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ కొంకణ్‌ , గోవాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వర్షాలపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే సమీక్ష నిర్వహించారు. ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చూడాలని ఆదేశించారు.

Updated Date - 2022-07-06T08:43:54+05:30 IST