‘పశ్చిమ’ను ముంచెత్తిన వర్షం
ABN , First Publish Date - 2022-05-26T09:39:24+05:30 IST
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు రైతన్నలకు అపారనష్టం సంభవించింది.
- ఈదురు గాలులతో కూలిన చెట్లు..
- రైతన్నలకు అపార నష్టం
- ఈదురు గాలులతో కూలిన చెట్లు..
- రైతన్నలకు అపార నష్టం
- నీట మునిగిన విశాఖ ఐవోసీ..
- నిలిచిపోయిన చమురు సరఫరా
భీమవరం/ఏలూరు సిటీ/మల్కాపురం(విశాఖ), మే 25: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు రైతన్నలకు అపారనష్టం సంభవించింది. ఈదురుగాలులకు అరటి పంట నేలమట్టమైంది. జిల్లాలో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తణుకు డివిజన్లోని 1,435 ఎకరాల్లో అరటికి నష్టం వాటిల్లింది. విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మంగళవారం రాత్రి పట్టణాలు, పల్లెలు అంధకారంలో ఉన్నాయి. ఆచంట, ఆకివీడు, పాలకొల్లు రూరల్, ఆకివీడు మండలాల్లోని గ్రామాల్లో ధాన్యం రాశులు, బస్తాలు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. వీరవాసరం మండలంలో సబ్స్టేషన్ బ్రేక్డౌన్ అయ్యింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ రాఘవాపురంలో ఎండ, వర్షాలతో ఉక్కబోతకు గురైన 1300 కోళ్లు మృత్యువాత పడ్డాయి. వేలేరుపాడు మండలం శివకాశీపురంలో పిడుగుపాటుకు పాడె గేదె మృతి చెందింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) విశాఖ యూనిట్ వరద ముంపునకు గురైంది. మంగళవారం అర్ధరాత్రి భారీవర్షం కురవడంతో పెద్దఎత్తున ఐఓసీ ప్రాంగణంలోకి నీరు చేరింది. దీంతో ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ట్యాంకర్ల క్యాబిన్ ఎత్తు వరకు వరద నీరు చేరడంతో చమురు లోడింగ్ పనులు ఆగిపోయాయి. ఇక్కడ రోజుకు దాదాపు 150 ఆయిల్ ట్యాంకర్లు లోడ్ అవుతుంటాయి. బుధవారం ఒక్క ట్యాంకర్ కూడా లోడ్ కాలేదు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చమురు రవాణా నిలిచిపోయింది.