అన్నదాతల్లో గుబులు
ABN , First Publish Date - 2021-11-08T05:23:57+05:30 IST
అన్నదాతల్లో గుబులు
భారీ వర్ష సూచనతో పరుగులు
కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి పంటలు
రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే ఇబ్బందే
ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : బంగాళాఖాతంలో ఈ నెల తొమ్మిదో తేదీన అల్పపీడనం ఏర్పడనున్నదని, దీని ప్రభావంతో 11వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వరి, పత్తి కోతకు వస్తున్న తరుణంలో ఈ హెచ్చరికలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత ఏడాది కూడా ఇలాగే నవంబరు ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు భారీ వర్షాలు కురవడంతో చేతికి అందివచ్చిన పంటలను కోల్పోయిన రైతులు తీవ్రంగా నష్ట్టపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండడంతో రైతుల్లో ఆందోళన మొదలయింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు కలవరపడుతున్నారు. యంత్రాల ద్వారా వరి కోతలు పూర్తిచేసినా ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కష్టమేనని రైతులు అంటున్నారు.
3,14,236 హెక్టార్లలో వివిధ పంటల సాగు
ఈ ఏడాది జిల్లా మొత్తం 3,14,236 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరిగింది. కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు తదితర ప్రాంతాల్లో ముందస్తుగా నాట్లు వేయడంతో వరిపైరు కోతకు సిద్ధంగా ఉంది. దీపావళి తరువాత కోతలు ప్రారంభించేందుకు సిద్ధమైన రైతులు ఇప్పుడు వాతావరణ మార్పుల కారణంగా ఆందోళన చెందుతున్నారు.