వచ్చే ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కుమ్మేయనున్న వర్షాలు

ABN , First Publish Date - 2022-06-12T00:38:53+05:30 IST

వచ్చే ఐదు రోజుల్లో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

వచ్చే ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కుమ్మేయనున్న వర్షాలు

న్యూఢిల్లీ: వచ్చే ఐదు రోజుల్లో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అరేబియా సముద్రంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేడు ముంబై సహా కొంకణ్‌లోని చాలా ప్రాంతాలతోపాటు మధ్యమహారాష్ట్ర, కర్ణాటకకు కూడా విస్తరించినట్టు పేర్కొన్నారు. వీటి ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ ద్వీపకల్ప తీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే, ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.


అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సబ్ హిమాలయన్ సిక్కిం, ఇతర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లోనూ వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అలాగే, బీహార్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, విదర్భ (మహారాష్ట్ర), చత్తీస్‌గఢ్‌లలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరిలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది.

Updated Date - 2022-06-12T00:38:53+05:30 IST