పలు రాష్ట్రాల్లో ఉరుములు,మెరుపులతో వడగళ్ల వర్షాలు...IMD warning
ABN , First Publish Date - 2022-04-19T15:50:14+05:30 IST
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 21వతేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురుస్తుందని భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 21వతేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురుస్తుందని భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) వెల్లడించింది.అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.ఈ నెల 18వ తేదీ నుంచి 21 ఏప్రిల్ వరకు బలమైన గాలులు, వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఈ కాలంలో ప్రజలు సురక్షితంగా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐఎండీ హెచ్చరించింది.
వడగళ్ల వర్షం కురవచ్చు...
బలమైన గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. వడగళ్ల వర్షం వల్ల తోటలు దెబ్బతింటాయి.వడగళ్ల వాన వల్ల బహిరంగ ప్రదేశాల్లో మనుషులు, పశువులు గాయపడవచ్చు.బలమైన గాలుల కారణంగా బలహీనమైన నిర్మాణాలకు పాక్షిక నష్టం కలగవచ్చు.కచ్చా ఇళ్లు,గుడిసెలకు స్వల్ప నష్టం జరగవచ్చు.
ఐఎండీ జాగ్రత్తలు...
వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇంట్లోనే ఉండాలని ఐఎండీ సూచించింది. కిటికీలు, తలుపులు మూసివేయండి. వీలైతే ప్రయాణాలను నివారించండి.సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలి. చెట్ల కింద తలదాచుకోవద్దు.కాంక్రీట్ అంతస్తులపై పడుకోకండి. కాంక్రీట్ గోడలకు ఆనుకొని ఉండకండి.ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అన్ప్లగ్ చేయండి.
5 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు
రాబోయే 5 రోజుల్లో జమ్మూ-కశ్మీర్-లడఖ్-గిల్గిత్-బాల్టిస్తాన్-ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్లలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ 20 నుంచి 22వతేదీ వరకు ఉత్తరాఖండ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.పంజాబ్, హర్యానా ఢిల్లీలలో ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 22 వరకు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్లో ఉరుములు, మెరుపులతో పాటు చెదురుమదురు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ కార్యాలయం తెలిపింది. రాబోయే 5 రోజుల్లో ఒడిశా, ఏప్రిల్ 18న తమిళనాడు-పుదుచ్చేరి-కరైకల్, కేరళ-మహారాష్ట్రలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. వచ్చే 5 రోజుల్లో కేరళ-మహారాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.