Rains: దెబ్బతిన్న ఇంటికి రూ.10వేలు

ABN , First Publish Date - 2022-09-13T18:35:43+05:30 IST

వర్షంతో ఇళ్లు దెబ్బతిన్న వారికి తలా రూ.10 వేలు ఇస్తున్నట్టు ఎమ్మెల్యే అరవింద లింబావళి తెలిపారు. మహదేవపుర నియోజకవర్గంలో

Rains: దెబ్బతిన్న ఇంటికి రూ.10వేలు

మహదేవపుర(బెంగళూరు), సెప్టెంబరు 12: వర్షంతో ఇళ్లు దెబ్బతిన్న వారికి తలా రూ.10 వేలు ఇస్తున్నట్టు ఎమ్మెల్యే అరవింద లింబావళి తెలిపారు. మహదేవపుర నియోజకవర్గంలో బీబీఎంపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్షపీడిత బాధితులకు పరిహారానికి సంబంధించి లబ్ధిపత్రాలను సోమవారం అంద చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకాలువ, చిన్నకాలువలు ఆక్రమణతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయన్నారు. రాజకాలువను ఎవరు ఆక్రమించినా పొక్లైనర్‌లతో తొలగిస్తామని హెచ్చరించారు. సుమారు 60ఏళ్ల క్రితం ఇంతటి భారీ వర్షం కురిసిందని పెద్దల ద్వారా తెలుస్తోందన్నారు. ఇప్పటికే పార్టీ నాయకులు, అధికారులు రక్షణా చర్యల్లో పాల్గొన్నారన్నారు. మహదేవపుర పరిధిలో 712 ఇళ్లు దెబ్బతిన్నట్టు గుర్తించామని ఆ కుటుంబాలకు తలా రూ.10వేలు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే 612మంది ఇవ్వగా మరో రెండు రోజుల్లో వందమందికి అందచేస్తామన్నారు. ఇళ్లు కూలిపోయే పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తరపున నిర్మిస్తామన్నారు. కాడుగూడి, శీగేహళ్ళి ప్రాంతాలలోని విల్లాలోకి కూడా నీరు చేరిందన్నారు. బెంగళూరులోని 80శాతం నీరు మహదేవపుర నియోజకవర్గం నుంచి తమిళనాడుకు వెడుతుందన్నారు. రోడ్లు, కాలువలలో ఇష్టం వచ్చినట్టు చెత్తా చెదారం వేయరాదన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బీబీఎంపీ జాయింట్‌ కమిషనర్‌ వెంకటాచలపతి, బీజేపీ హోబళి అధ్యక్షుడు మనోహరరెడ్డి, రూరల్‌ అధ్యక్షుడు నటరాజ్‌, నియోజకవర్గ మహిళా మోర్చా అధ్యక్షు రాలు పుష్ప మంజునాథ్‌, వెంకటస్వామిరెడ్డి, హగదూరు శ్రీనివాస్‌, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-13T18:35:43+05:30 IST