జిల్లాలో కురుస్తున్న వర్షాలు
ABN , First Publish Date - 2022-07-06T07:04:42+05:30 IST
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతున్న వరదనీరు
కడెం ప్రాజెక్టు వరదగేటు ఎత్తివేత
నిర్మల్, జూలై 5 (ఆంఽధ్రజ్యోతి) : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల కంటే కడెం ప్రాజెక్ట్కు ఎక్కువ మొత్తంలో వరద నీరు వస్తోంది. ప్రస్తుతం 36,917 వరద నీరు కడెం ప్రాజెక్ట్లోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 690.150 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్త్యం 7603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.293 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ ఒక వరదగేటును ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోకి 3084 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గడ్డెన్నవాగు ప్రాజెక్టు లోకి 931 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 350.400 మీటర్లకు చేరింది. ప్రాజెక్టునీటిని సామర్థ్యం 1.852టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 1.245 టీఎంసీలకు చేరింది. స్వర్ణ ప్రాజెక్ట్లోకి 763 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1176.9 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.484 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.907కు చేరింది. జిల్లాలో 41.6 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది. కాగా మామడ మండలంలో అత్యధికంగా 85.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.