నమ్మకద్రోహం అంటే ఇదే..

ABN , First Publish Date - 2021-04-18T05:44:12+05:30 IST

నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్‌.. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని అంటున్నారని.. దీనిని నమ్మక ద్రోహం అనరా.. అని రాజధాని రైతులు ప్రశ్నించారు.

నమ్మకద్రోహం అంటే ఇదే..
దొండపాడు శిబిరంలో ఆందోళన చేస్తున్న మహిళలు, రైతులు

 నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి మద్దతు ఇచ్చారు..

అధికారంలోకి వచ్చాక తెరపైకి మూడు రాజధానులు

దీనిని నయవంచన అనరా..? 

487వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు



తుళ్లూరు, తాడికొండ, తాడేపల్లి, ఏప్రిల్‌ 17: నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్‌.. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని అంటున్నారని.. దీనిని నమ్మక ద్రోహం అనరా.. అని రాజధాని రైతులు ప్రశ్నించారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ ఆ ప్రాంతవాసులు చేపట్టిన ఆందోళనలు శనివారం 487వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్ష శిబిరాల్లో రైతులు మాట్లాడుతూ రాజధాని కోసం తాము స్వచ్ఛందంగా భూములు ఇస్తే ఈ ప్రభుత్వం కర్కశంగా ప్రవర్తిస్తోందన్నారు.  మూడు ముక్కల ఆటతో రాష్ట్రమే వెనకబడిపోయిందన్నారు. విశాఖ, కర్నూలువాసులు కూడా రాజధాని కావాలని అడగలేదన్నారు. ప్రాణ సమానమైన భూములిస్తే ఇలా నడిరోడ్డు మీద కూర్చోబెడతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయదేవత తమకు అండగా ఉంటుందని, తమది ధర్మపోరాటమన్నారు. ప్రపంచస్థాయి ప్రజా రాజధాని ఏర్పాటైతే అంతా సంతోషించారన్నారు. రాజధానిని మార్చిన సీఎం జగన్మోహనరెడ్డిని అభినవ తుగ్లక్‌గా అభివర్ణించారు. రాజధాని తరలిపోతుందనే ఆందోళనతో దాదాపుగా 130 మంది రైతులు, రైతు కూలీలు చనిపోయారని పేర్కొన్నారు. మూడు రాజధానుల ప్రకటనను వెనకకు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. రాజధాని వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడక, ముక్కామల గ్రామాల రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగించారు.  

Updated Date - 2021-04-18T05:44:12+05:30 IST