రాజ్యాంగమే మాకు రక్ష
ABN , First Publish Date - 2020-11-27T06:06:47+05:30 IST
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే తమకు రక్షగా నిలుస్తుందని రాజధాని రైతులు అన్నారు.
జోరు వానలోనూ కొనసాగిన దీక్షలు
345వ రోజుకు చేరిన రైతులు ఆందోళనలు
తుళ్లూరు, నవంబరు 27: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే తమకు రక్షగా నిలుస్తుందని రాజధాని రైతులు అన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు గురువారం 345వ రోజుకు చేరుకున్నాయి. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రాజధాని రైతు శిబిరాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి, బోరుపాలం, ఐనవోలు, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, మందడం, అబ్బరాజుపాలెం, పెనుమాక, బేతపూడి, ఎర్రబాలెం తదితర రైతు శిబిరాల్లో జోరువానలోనూ దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పాలకులు చేసే తప్పులకు న్యాయవ్యవస్థపై అభాండాలు వేస్తారా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్దంగా, చట్టాలకు లోబడి పరిపాలన చేయాల్సినవారు, అడ్డదారుల్లో వెళితే ప్రజలే న్యాయస్థానాలను ఆశ్రయిస్తారని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి నియంత పాలన సాగించాలని సీఎం జగన్ కుట్ర పన్నాడన్నారు. తమ అభ్యర్థనను సుమోటోగా తీసుకొని న్యాయవ్యవస్థపై విమర్శలు చేస్తున్నవారిని విచారించి శిక్షించాలని రాజ్యాగం ఆమోద దినోత్సవం సందర్భంగా కోరుతున్నామని రైతులు పేర్కొన్నారు. లింగాయపాలెం రామాలయంలో సేవ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ అంటూ మహిళలు పూజలు నిర్వహించారు. కడప నుంచి వచ్చిన పోతల కుమార్ రాజధాని రైతు శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.