TS News: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా
ABN , First Publish Date - 2022-07-25T22:29:30+05:30 IST
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (MLA Rajagopal Reddy) వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తోంది.
హైదరాబాద్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (MLA Rajagopal Reddy) వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ (Manickam Tagore) రంగంలోకి దిగారు. రాజగోపాల్రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడిన అంశాల క్లిప్పింగ్స్ను అధిష్టానం తీసుకుంది. ఆయన గతంలో కూడా పార్టీ విషయంలో చేసిన కామెంట్స్... ఇచ్చిన వివరణలను మాణిక్కం ఠాగూర్ తెప్పించుకున్నారు. గతంలో ఆర్సీ కుంతియా, ఉత్తమ్కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పార్టీ విషయంలో.. నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ఉపఎన్నికల సమయంలో చేసిన కామెంట్స్ను కూడా ఠాగూర్ తీసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, పార్టీ మారడం చారిత్రక అవసరమని రాజగోపాల్రెడ్డి చేసిన కామెంట్స్పై కాంగ్రెస్ నేతలు (Congress Leaders) సీరియస్గా ఉన్నారు.
సమయం వచ్చినప్పుడు పార్టీ మారడం చారిత్రక అవసరమని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భయపడి ఇంట్లో కూర్చుంటే చరిత్ర హీనుడిగా మిగులుతానన్నారు. అయితే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందన్నది సీఎం కేసీఆర్ ఆడుతున్న డ్రామా, దుష్ప్రచారం అని ఆరోపించారు. తాను మాత్రం ఉప ఎన్నికను కోరుకోవడంలేదని, రాజీనామా చేయాలనుకోవడంలేదని తెలిపారు. మునుగోడు ప్రజలు తలచుకుంటే, తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ (CM KCR) కు బుద్ది చెప్పాలనుకుంటే మాత్రం ఉప ఎన్నిక వస్తుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలకు తప్ప ఇతర ఏ సందర్భంలోనూ కాంగ్రెస్ నేతలతో రాజగోపాల్ కలిసి రాలేదు. అయితే తాజాగా అమిత్షా ఒత్తిడి నేపథ్యంలో ఆయన పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి ఆగస్టులో తమ నాయకుడు ఒక ప్రకటన చేస్తారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంస్థ.. కాంట్రాక్టులు చేస్తుందనీ, వాటి పనుల నిమిత్తమే రాజగోపాల్రెడ్డి తరచూ బీజేపీ పెద్దలను కలుస్తుంటారనీ కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఉంది. ఆ క్రమంలోనే బీజేపీకి దగ్గరయ్యారనీ చెబుతుంటారు.
మునుగోడు ఉప ఎన్నికల జరిగితే ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డిలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. శాసనసభ ఎన్నికల ముందు వచ్చే ఈ ఉప ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చావో.. రేవో లాంటివనీ ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కీలక పదవిని క్లెయిమ్ చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపైనే ఈ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత పెట్టాలన్న ప్రతిపాదన అధిష్ఠానం ముందు పెడతామని పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. రాజగోపాల్రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సొంత సోదరుడు కావడంతో సహజంగానే కోమటిరెడ్డిపైన రాజకీయంగా ఈ మేరకు ఒత్తిడీ పెరుగుతుందని చెబుతున్నారు.