మా గ్రామాలను విలీనం చేయవద్దు
ABN , First Publish Date - 2022-07-01T06:21:07+05:30 IST
గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేయవద్దంటూ కోలమూరు, కొంతమూరు, రాయుడుపాకలకు చెందిన గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఎంపీడీవోకు మూడు గ్రామాల ప్రజల విన్నపం
రాజమహేంద్రవరం రూరల్, జూన్ 30 : గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేయవద్దంటూ కోలమూరు, కొంతమూరు, రాయుడుపాకలకు చెందిన గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు పంచాయతీ కార్యాలయం వద్ద రూరల్ ఎంపీడీవో రత్నకుమారి అధ్యక్షతన గురువారం నిర్వహించిన విలీన గ్రామసభకు 64 మంది హాజరయ్యారు. నగరపాలక సంస్థలో విలీనమైనంత మాత్రాన తమకు ఒరిగేదేమిలేదని గ్రామస్థులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నగరపాలక సంస్థలో గ్రామాన్ని కలపాలా? వద్దా? అన్నదానిపై ఓటింగ్ నిర్వహించారు. నగరపాలక సంస్థలో తమ గ్రామాన్ని విలీనం చేయవద్దంటూ చేతులెత్తి వారి అభిప్రాయన్ని తెలియజేశారు.ఈ మేరకు ఉన్నతాధికారులకు గ్రామసభ నివేదిక సమర్పిస్తానని ఎంపీడీవో తెలిపారు. గ్రామసభ అనంతరం భవానీపురం, బొమ్మన కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ ప్రాంతంలో రోడ్లు, డ్రెయినేజీలు లేవని ఇబ్బందులు పడుతున్నామని ఎంపీడీవోను నిలదీశారు. గత మూడేళ్లగా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు.