భక్తులతో కిక్కిరిసిపోయిన వేములవాడ రాజన్న సన్నిధి

ABN , First Publish Date - 2022-08-23T11:41:47+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ

భక్తులతో కిక్కిరిసిపోయిన వేములవాడ రాజన్న సన్నిధి

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం (Vemulawada Temple) శ్రావణమాసం(Sravanamasam) చివరి సోమవారం సందర్భంగా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లఘు దర్శనం అమలు చేస్తుండడంతో  నందీశ్వరుడి వద్ద నుంచి  స్వామివారిని దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా భక్తులు  స్వామివారికి  ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు.  స్వామివారి రుద్రాభిషేకం, అన్నపూజ,  స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, కుంకుమపూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా భక్తుల సంఖ్య ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండడంతో స్వామివారి దర్శనం కోసం మూడు నుంచి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. కోడెమొక్కు చెల్లింపు కోసం భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు.

కోడెమొక్కుల క్యూలైన్‌ ఆలయం నుంచి గుడి చెరువు మైదానం వరకు కొనసాగింది. ఫలితంగా కోడెమొక్కు చెల్లింపునకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. సోమవారం సుమారు 50 వేల మందికిపైగా భక్తులు  స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఖజానాకు సుమారు రూ.35 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల తాకిడితో ఆలయ ముందుభాగం, జాత్రాగ్రౌండ్‌, అంబేద్కర్‌ కూడలి, పార్వతీపురం ప్రాంతాలను జాతరను తలపించాయి. గుడి చెరువు మైదానం భక్తుల వాహనాలతో నిండిపోయింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

Updated Date - 2022-08-23T11:41:47+05:30 IST