ఈరోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: రాజాసింగ్

ABN , First Publish Date - 2022-03-07T21:10:48+05:30 IST

ప్రజాస్వామ్యానికి ఇవాళ చీకటి రోజని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

ఈరోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: రాజాసింగ్

హైదరాబాద్: ప్రజాస్వామ్యానికి ఇవాళ చీకటి రోజని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సోమవారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాము బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం అసెంబ్లీలో ఉంటే తమ హక్కుల్ని కాలరాస్తూ ముగ్గురు బీజేపీ ఎమ్యెల్యేలను సెషన్ అంతా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కుట్రలో భాగంగానే తమను సస్పెండ్ చేశారని అన్నారు. మహాత్మాగాంధి విగ్రహం దగ్గర నిరసన చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని, తమ హక్కులను హరించే హక్కు సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గౌరవ సభ్యులమని కూడా చూడకూండా మమ్మల్ని అసెంబ్లీ ఆవరణ నుంచి పోలీసులు ఏ విధంగా అరెస్టు చేస్తారన్నారు. హక్కుల్ని కాపాడాల్సిన స్పీకర్ కూడా స్పందించకపోవడం దారుణమన్నారు.


రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సభా సంప్రదాయల్ని పాటించకుండా ప్రతిపక్ష శాసన సభ్యుల గొంతు నొక్కుతున్నారని రాజాసింగ్ విమర్శించారు. పోలీసులను సెక్యూరిటీగా పెట్టుకుని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, చివరికి దేవాలయం లాంటి అసెంబ్లీని కూడా పోలీసులతోనే నడపుతున్నారన్నారు. ఈ సీఎం నయా నిజాం అనుకుంటున్నారని, నిరంకుశంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణాలో కల్వకుంట్ల రాజ్యాంగం నడవనీయమని, ఈ నయా నిజాం రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని రాజాసింగ్ అన్నారు.

Updated Date - 2022-03-07T21:10:48+05:30 IST