యూపీ బుల్డోజర్లు.. తెలంగాణకూ వస్తాయ్: రాజాసింగ్ సంచలనం
ABN , First Publish Date - 2022-03-10T19:29:55+05:30 IST
గతంలో యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందేనని.. బీజేపీకి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తన నోటికి పని చెప్పారు.
హైదరాబాద్ : గతంలో యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందేనని.. బీజేపీకి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తన నోటికి పని చెప్పారు. బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని.. యూపీ బుల్డోజర్లు తెలంగాణకు సైతం వస్తున్నాయని రాజసింగ్ పేర్కొన్నారు. నేడు రాజాసింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనను బల్డోజర్లతో తొక్కిచ్చేస్తామన్నారు. డబ్బులు సంపాదన కోసమే దేశ వ్యాప్తంగా ఎంఐఎం పోటీ చేస్తోందన్నారు. ఎంఐఎంతో బీజేపీ దోస్తీ అనేది.. కేవలం ప్రచారం మాత్రమేనన్నారు. ఎంఐఎం తమకు రాజకీయ శత్రువని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణను గెలుస్తామన్నారు. యోగీ నాయకత్వాన్ని యూపీ ప్రజలు సమర్థించారని రాజసింగ్ తెలిపారు.
యూపీలో యోగీకి ఓటేయకుంటే..
సంచలన వ్యాఖ్యలు చేయడం రాజాసింగ్కు కొత్తమే కాదు. గతంలోనూ ఇలా ఇష్టానుసారంగా మాట్లాడి విమర్శల పాలయ్యారు. గతంలో యూపీ ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ.. ‘‘యూపీలో ఉండాలనుకుంటే యోగి అనాల్సిందే. ఎన్నికల అనంతరం బీజేపీకి ఓటు వేయని వారి జాబితా తీస్తాం. వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తాం. ఇప్పటికే యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారు. బీజేపీకి ఓటు వేయని వారు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలి” అని రాజాసింగ్ హెచ్చరించారు.