Rajasthan Government : సాధువు మరణంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు
ABN , First Publish Date - 2022-07-24T16:59:56+05:30 IST
రాజస్థాన్ (Rajasthan)లోని భరత్పూర్లో చట్టవిరుద్ధంగా జరుగుతున్న గనుల తవ్వకాలపై
జైపూర్ : రాజస్థాన్ (Rajasthan)లోని భరత్పూర్లో చట్టవిరుద్ధంగా జరుగుతున్న గనుల తవ్వకాలపై నిరసన తెలిపిన సాధువు శ్రీ విజయ్ బాబా (Saint Shri Vijay Baba) ఆత్మాహుతి చేసుకున్నారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ప్రకటించారు.
అశోక్ గెహ్లాట్ ఇచ్చిన ట్వీట్లో, సాధువు శ్రీ విజయ్ బాబా మరణించడం అత్యంత విచారకరమని తెలిపారు. ఆయనను కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామన్నారు. ఆయనకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించామన్నారు. ఆయన డిమాండ్లకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని, అయినప్పటికీ ఆయన ఎందుకు ఈ దురదృష్టకర నిర్ణయం తీసుకోవలసి వచ్చిందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి చేత దర్యాప్తు చేయిస్తామన్నారు. విజయ్ బాబా కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (Chief Minister's relief fund) నుంచి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేస్తామన్నారు.
రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా, డీగ్ ప్రాంతంలో అక్రమ గనుల తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దీంతో ఇక్కడి సాధువులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దాదాపు 500 రోజుల నుంచి విజయ్ బాబా ధర్నా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 501వ రోజున ఆయన ఆత్మాహుతి చేసుకున్నారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆయనను మొదట స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి, ఆ తర్వాత ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. శ్రీ విజయ్ బాబా మరణానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింథియా (Vasundhara Raje Scindhia) ఆరోపించారు. సాధువుల డిమాండ్లపై సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదన్నారు.