రాజస్థాన్‌లో మళ్లీ మొదలైన ‘ట్యాపింగ్’ గొడవ

ABN , First Publish Date - 2021-06-13T19:58:38+05:30 IST

రాజస్థాన్‌లో మళ్లీ రాజకీయం వేడెక్కింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని

రాజస్థాన్‌లో మళ్లీ మొదలైన ‘ట్యాపింగ్’ గొడవ

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో మళ్లీ రాజకీయం వేడెక్కింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నారని పైలట్ మద్దతుదారు, ఎమ్మెల్యే వీపీ సోలంకి వెల్లడించారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఎమ్మెల్యేలను ఇరికించడానికి కొందరు ప్రయత్నాలను ప్రారంభించారని ఆయన ఆరోపించారు. ‘‘నా ఫోన్ ట్యాప్ అయ్యిందా? లేదా? అన్న విషయం నాకు తెలియదు. కానీ తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చాలా మంది ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ట్యాప్ జరుగుతున్నాయని చాలా మంది అధికారులు కూడా చెబుతున్నారు. ప్రయత్నాలు కూడా ముమ్మరం అవుతున్నాయి. ఈ ట్యాపింగ్ విషయాన్ని ఎమ్మెల్యేలు సీఎం గెహ్లోత్ దృష్టికి కూడా తీసుకెళ్లారు’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీపీ సోలంకి వెల్లడించారు. తమ తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయా? లేదా? అని తెలుసుకోడానికి ఎమ్మెల్యేలు ఓ యాప్‌ సహాయం తీసుకుంటున్నారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తే, గెహ్లోత్ నవ్వి ఊరుకున్నారని మండిపడ్డారు. 


నిరాధార ఆరోపణలు : చీఫ్ విప్

ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి స్పందించారు. ఈ ఆరోపణలన్నీ నిరాధారమని కొట్టిపారేశారు. ఓ బాధ్యతాయుత ఎమ్మెల్యే స్థానంలో ఉంటూ, ఇలాంటి వ్యాఖ్యలు చేసే సమయంలో నిర్ధారణ చేసుకొని మాట్లాడాలని మహేశ్ జోషి చురకలంటించారు.  


సీఎం స్పందించాలి : కేంద్రమంత్రి షెకావత్


ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని సీఎం గెహ్లోత్‌ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లినట్లు తమకు సమాచారం అందిందని, ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని షెకావత్ డిమాండ్ చేశారు. ఇదే విధమైన ఆరోపణలు చాలా రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్నాయని మండిపడ్డారు. ఇలా చట్ట విరుద్ధంగా ట్యాప్‌ చేస్తూ, దానిని రాజకీయ ఆయుధంగా మలుచుకుంటున్నారని షెకావత్ మండిపడ్డారు.

Updated Date - 2021-06-13T19:58:38+05:30 IST