Big Shock To Ashok Gehlot: గెహ్లాట్కు చెక్ పెట్టిన సోనియా... అధ్యక్ష రేసు నుంచి ఔట్!
ABN , First Publish Date - 2022-09-29T20:42:21+05:30 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్ధి రేసులో ముందున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెక్ పెట్టారు.
క్షమించమని సోనియాను కోరాను: అశోక్ గెహ్లాట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్ధి రేసులో ముందున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెక్ పెట్టారు. నిన్న సాయంత్రం నుంచి పడిగాపులు కాసిన గెహ్లాట్కు ఎట్టకేలకూ అపాయింట్మెంట్ ఇచ్చిన సోనియా ఆయన్ను గట్టిగా మందలించారు. కేసీ వేణుగోపాల్ సమక్షంలోనే క్లాసు పీకారు. ఇటీవల రాజస్థాన్లో గెహ్లాట్ వర్గీయులు ఓవర్ యాక్షన్ చేయడం, తాను ఏమీ చేయలేనంటూ గెహ్లాట్ చేతులెత్తేయడంపై సోనియా మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ రాజస్థాన్ అసమ్మతి.. పార్టీకి చెడ్డపేరు తెచ్చిందని సోనియా కన్నెర్ర చేశారు. గంటకు పైగా జరిగిన సమావేశంలో సోనియా అన్ని విషయాలపై నిలదీశారు. రాజస్థాన్ అసమ్మతిని కంట్రోల్ చేయలేని నాయకుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఎలా నడపగలరని సోనియా ప్రశ్నించినట్లు తెలిసింది. గెహ్లాట్ తన నమ్మకాన్ని వమ్ము చేశారని కూడా సోనియా అన్నట్లు సమాచారం.
సోనియాతో సమావేశం తర్వాత అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో లేనని, ఎన్నికల్లో పోటీ చేయబోవడంలేదని స్పష్టం చేశారు. అంతేకాదు తాను సీఎంగా ఉండాలా వద్దా అనేది కూడా సోనియా నిర్ణయిస్తారని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడైన కార్యకర్తనని చెప్పుకొచ్చారు. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ ఆదేశాలను తాను పాటిస్తానని చెప్పారు. రాజస్థాన్లో తన మద్దతు దారుల ఓవర్ యాక్షన్పై సోనియాకు సారీ చెప్పానని గెహ్లాట్ తెలిపారు.
అశోక్ గెహ్లాట్తో సమావేశం ముగియగానే కాంగ్రెస్ పార్టీ నేత సచిన్పైలట్కు సోనియా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ సమావేశం తర్వాత గెహ్లాట్కు బదులుగా సచిన్పైలట్ను సీఎం చేస్తారా లేదా అనేది స్పష్టం కానుంది.
మరోవైపు పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు రేపే ( సెప్టెంబర్ 30) ఆఖరు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. రేపు ( సెప్టెంబర్ 30) నామినేషన్ వేస్తానని ప్రకటించారు. శశిథరూర్ కూడా రేపు నామినేషన్ వేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. సోనియా కుటుంబ సభ్యులు కాకుండా బయటివారే కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని రాహుల్ గాంధీ కోరుతున్నారు. అందుకే ఆయన నామినేషన్ వేయడం లేదు.