శబరిమల ఆచారాల పరిరక్షణ చట్టం తెస్తాం : రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2021-03-28T16:41:04+05:30 IST

కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయంలో సంప్రదాయాలు

శబరిమల ఆచారాల పరిరక్షణ చట్టం తెస్తాం : రాజ్‌నాథ్ సింగ్

తిరువనంతపురం : కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయంలో సంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. శబరిమల పరిరక్షణకు బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 


కేరళ శాసన సభ ఎన్నికల సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపడితే శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఆచారాలు, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఓ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆధిక్యత సాధించి,  కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దామని చెప్పారు. 


కేరళ శాసన సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా శబరిమల పరిరక్షణ చట్టం గురించి హామీ ఇచ్చారు. 140 స్థానాలున్న కేరళ శాసన సభ ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది. 


Updated Date - 2021-03-28T16:41:04+05:30 IST