భారత క్షిపణి పొరపాటున పాకిస్థాన్‌లో పడటంపై దర్యాప్తు జరుగుతోంది : రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2022-03-15T18:07:47+05:30 IST

భారత దేశంలోని క్షిపణి విభాగంలో తనిఃఖీల సమయంలో ప్రమాదఃవశాత్తూ

భారత క్షిపణి పొరపాటున పాకిస్థాన్‌లో పడటంపై దర్యాప్తు జరుగుతోంది :  రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : భారత దేశంలోని క్షిపణి విభాగంలో తనిఃఖీల సమయంలో ప్రమాదఃవశాత్తూ ఓ క్షిపణి విడుదలై పాకిస్థాన్ భూభాగంలో పడిన సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంటుకు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగకపోవడం కాస్త ఊరటనిచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. 


‘‘2022 మార్చి 9న జరిగిన సంఘటన గురించి సభకు తెలియజేయాలనుకుంటున్నాను. తనిఖీల సమయంలో ప్రమాదవశాత్తూ జరిగిన మిస్‌ఫైర్‌కు సంబంధించిన విషయం ఇది. మిసైల్ యూనిట్‌లో తనిఖీలు, రోటీన్ మెయింటెనెన్స్ జరుగుతుండగా, రాత్రి 7 గంటల ప్రాంతంలో ఓ క్షిపణి ప్రమాదవశాత్తూ విడుదలైంది’’ అని రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం రాజ్యసభకు చెప్పారు. 


ఈ సంఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రామాణిక కార్యకలాపాల విధానాలను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. రక్షణ, భద్రతలకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. అత్యున్నత స్థాయి కోర్ట్ ఇంక్వైరీకి ఆదేశించినట్లు తెలిపారు. లోపాలను గుర్తిస్తే, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారత దేశ క్షిపణి వ్యవస్థ సురక్షితంగా ఉందని, విశ్వసనీయంగా ఉందని తెలిపారు. సకాలంలో సమీక్షిస్తామని, మన సాయుధ దళాలు సుశిక్షితులని, క్రమశిక్షణగలవారని తెలిపారు. క్షిపణి వ్యవస్థను నిర్వహించగలిగే అనుభవం మన సాయుధ దళాలకు ఉందని చెప్పారు. 


Updated Date - 2022-03-15T18:07:47+05:30 IST