Dussehra : దసరా సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ఏం చేశారంటే...
ABN , First Publish Date - 2022-10-05T16:34:16+05:30 IST
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh
న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) దసరా పండుగ సందర్భంగా ఆయుధాలకు పూజలు చేశారు. ఉత్తరాఖండ్లోని చమోలీలో ఔలీ మిలిటరీ స్టేషన్ (Auli Military Station)లో జరిగిన ఈ కార్యక్రమంలో భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే (General Manoj Pande) కూడా పాల్గొన్నారు. మంత్రోచ్చాటనల మధ్య రాజ్నాథ్ సింగ్ ఆయుధాలకు పూజలు చేశారు. సైనికులు దేశభక్తి గీతాలను ఆలపించారు.
రాజ్నాథ్ మాట్లాడుతూ, ఆయుధాలకు పూజలు, ప్రార్థనలు జరిగే ఏకైక దేశం భారత దేశమని చెప్పారు. మన రక్షణ దళాల చేతుల్లో మన దేశం సురక్షితంగా ఉందన్నారు. మన రక్షణ దళాలు, పారామిలిటరీ దళాల జవాన్లు మన దేశానికి గర్వకారణమని తెలిపారు.
ఇదిలావుండగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన స్వయంసమృద్ధ భారత దేశం (ఆత్మనిర్భర్ భారత్) కార్యక్రమంలో భాగంగా మన దేశంలోనే తయారైన లైట్ కంబాట్ హెలికాప్టర్ల తొలి బ్యాచ్ను రాజ్నాథ్ సింగ్ సోమవారం వాయు సేనకు అప్పగించారు. ఈ సందర్భంగా రాజస్థాన్లోని జోధ్పూర్లో ఆయన మాట్లాడుతూ, భారత వాయు సేనకు ఇది గొప్ప మైలురాయి వంటిదని తెలిపారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి యుద్ధ హెలికాప్టర్ల కోసం విదేశాలపై ఆధారపడవలసి వచ్చేదన్నారు. ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించవలసిన అవసరం 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం సమయంలో కనిపించిందన్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు మారిందని చెప్పారు.