రాజ్యసభ ఎన్నికల్లో Bjp తరపున కొత్త ముఖం?
ABN , First Publish Date - 2022-05-28T17:06:39+05:30 IST
రాష్ట్రం నుంచి రాజ్యసభలోని నాలుగు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో అధికార బీజేపీ తరపున కొత్త ముఖం తెరపైకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం నుంచి
- ఎంపిక ఆశ్చర్యకరంగానే ఉంటుందంటున్న పార్టీ శ్రేణులు
బెంగళూరు: రాష్ట్రం నుంచి రాజ్యసభలోని నాలుగు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో అధికార బీజేపీ తరపున కొత్త ముఖం తెరపైకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ఈసారి ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇదే కనుక జరిగితే రాష్ట్రం నుంచి మరో నేతకు రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. శాసనసభలో ఉన్న బలాబలాల దృష్ట్యా అధికార బీజేపీకి రెండు స్థానాల్లో విజయం సునాయాసంగా దక్కుతుంది. ప్రస్తుత సిట్టింగ్లలో కేసీ రామమూర్తికి మరో చాన్స్ ఇవ్వాలని బీజేపి అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రె్సకు ఒక స్థానం మాత్రమే దక్కనుండగా ఇందుకు కేంద్రమాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ జైరాం రమేష్ పేరు దాదాపుగా ఖరారైందని, ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. పార్టీ అధినేత సూచన మేరకు జైరాం రమేష్ గురువారం నుంచి రాజధానిలోనే ఉన్నారు. శుక్రవారం కేపీసీసీ కార్యాలయంలో జరిగిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. న గరంలో గురువారం ఆయన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ను భేటీ అయ్యారు. శుక్రవారం ప్రతిపక్ష నేత సిద్దరామయ్యతో కూడా చర్చలు జరిపారు. జైరాం రమేష్ కు కర్ణాటక నుంచి అనివార్య పరిస్థితిలోనే మరో అవకాశం కల్పించాల్సి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య క్రమేపీ తగ్గిపోతున్న నేపథ్యంలో జైరాం రమేష్ వంటి సీనియర్ నేత రాజ్యసభలో తప్పనిసరిగా ఉండాలని భావిస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు కర్ణాటక నుంచి ఆయనకు మరోసారి అవకాశం కల్పించారని తెలుస్తోంది. ఇక రాజ్యసభ నాల్గో స్థానంపై ఉత్కంఠత ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ పరోక్ష మద్దతుతో ఈ స్థానాన్ని దక్కించుకోవాలని తెరవెనుక జేడీఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు మాజీ ఎంపీ కుపేంద్రరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ఆదివారం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.