వ్యవసాయోత్పత్తులను పార్లమెంటు ఎదుట అమ్ముతాం : రాకేశ్ తికాయత్

ABN , First Publish Date - 2021-10-30T00:53:02+05:30 IST

కొత్త సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులు

వ్యవసాయోత్పత్తులను పార్లమెంటు ఎదుట అమ్ముతాం : రాకేశ్ తికాయత్

న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులు తమ వ్యవసాయోత్పత్తులను ఇకపై పార్లమెంటు ఎదుట అమ్ముతారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ శుక్రవారం చెప్పారు. ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతుల నిరసన శిబిరాల వద్ద బారికేడ్లను పోలీసులు తొలగించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సుమారు 11 నెలల నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఘాజీపూర్ వద్ద రైతుల నిరసన శిబిరాల వద్ద గతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. ఈ నేపథ్యంలో రాకేశ్ తికాయత్ శుక్రవారం మాట్లాడుతూ, రైతులు తమ వ్యవసాయోత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చునని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారన్నారు. అదే మాటను ఇప్పుడు తాము రైతులకు చెబుతామన్నారు. రోడ్లపై ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తే తాము ఢిల్లీ వెళ్తామన్నారు. తమ వ్యవసాయోత్పత్తులను పార్లమెంటు ఎదుట అమ్ముతామన్నారు. దీనిపై సంయుక్త కిసాన్ మోర్చా ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 


ఢిల్లీ నుంచి నోయిడా వెళ్ళే మార్గంలో రైతుల నిరసనల వల్ల ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతోందని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు అక్టోబరు 21న విచారణ జరిపింది. నిరసన తెలిపే హక్కు బాధిత రైతులకు ఉందని, అయితే రోడ్లను నిరవధికంగా దిగ్బంధనం చేయకూడదని తెలిపింది. దీంతో టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లోని రైతుల నిరసన శిబిరాల వద్ద గతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢిల్లీ పోలీసులు తొలగిస్తున్నారు. కొత్త సాగు చట్టాల వల్ల వ్యవసాయ రంగంపై ప్రైవేటు రంగం ఆధిపత్యం పెరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఈ చట్టాల వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రభుత్వం చెప్తోంది. పంటలకు విస్తృత స్థాయిలో మార్కెట్ అందుబాటులోకి వస్తుందని చెప్తోంది. 


Updated Date - 2021-10-30T00:53:02+05:30 IST