Farmers protest: రాకేష్ టికాయత్ ముందస్తు కస్టడీ..ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
ABN , First Publish Date - 2022-08-21T22:33:01+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీ మరోసారి రైతు నిరసనలకు వేదక కానుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి రైతు నిరసనలకు వేదక కానుంది. సోమవారం జరుగనున్న రైతు నిరసనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు చర్యగా భారతీయ కిసాన్ యూనియన్ (BKU) ప్రతినిధి రాకేష్ టికాయత్ను ఆదివారంనాడు కస్టడీలోకి తీసుకున్నారు. మధువిహార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై టికాయత్ ఓ ట్వీట్లో స్పందించారు. రైతుల నిరసనను ఢిల్లీ పోలీసులు అణిచివేయలేరని అన్నారు. ఢిల్లీలోకి అడుగుపెడుతుండగా తనను అరెస్టు చేశారని, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఢిల్లీ పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. రైతులు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ అరెస్టు కొత్త విప్లవాన్ని తీసుకువస్తుందని, ఈ పోరాటం చివరి శ్వాస వరకూ కొనసాగుతుందని అన్నారు. ''మేము ఆగేది లేదు. మేము అలసిపోం. తలవంచం'' అని టికాయత్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. తనను నిర్బంధంలోకి తీసుకున్న ఫోటోను ట్వీట్కు జతచేశారు. కాగా, టికాయత్ అరెస్టును ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ ఖండించారు.
జంతర్ మంతర్ వద్ద ఈనెల 21న నిరసన తెలిపేందుకు రైతు నేతలు ఇచ్చిన పిలుపుతో వివిధ రాష్ట్రాల నుంచి రైతులు దేశరాజధానికి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ-హర్యానా టిక్రి సరిహద్దు వద్ద భద్రతను క్టటుదిట్టం చేయడంతో పాటు సిమెంట్ బారికేడ్లు ఏర్పాటు చేశారు.