దౌర్జన్యంగా ఇళ్లను కూల్చేశారు..

ABN , First Publish Date - 2022-07-01T06:27:27+05:30 IST

పెనుగొండ మండలం రామన్నపాలెంలో సుమారు ఇరవై ఏళ్లుగా.. ఇళ్లు నిర్మించుకుని నివశిస్తున్న తమకు ఎటువంటి సమాచారం లేకుండా కూల్చేశారని గురువారం స్థానికులు ఆందోళ న చేపట్టారు.

దౌర్జన్యంగా ఇళ్లను కూల్చేశారు..
రామన్నపాలెంలో నిరసన తెలుపుతున్న బాధితులు

రామన్నపాలెం వాసుల ఆందోళన 

పెనుగొండ / ఆచంట, జూన్‌ 30 : పెనుగొండ మండలం రామన్నపాలెంలో సుమారు ఇరవై ఏళ్లుగా.. ఇళ్లు నిర్మించుకుని నివశిస్తున్న తమకు ఎటువంటి సమాచారం లేకుండా కూల్చేశారని గురువారం స్థానికులు ఆందోళ న చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కొంతకాలం నుంచి రాజకీయ కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే ఈ ఘటనకు పాల్పడ్డారని వాపోయారు. ఈ ప్రాంతంలో  2.75 ఎకరాలలో 110 మంది లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వగా తూర్పువైపు ప్రధాన రహదారి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ దారి ఉండగా పడమర వైపు ఉన్న ప్రభుత్వ పోరంబోకు స్థలం రహదారికి కావాలనే ఉద్దేశంతో అధికారులను ఉసిగొల్పి కూల్చేందుకు స్థానిక సర్పంచ్‌తో సహా కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భారీగా పోలీసులు మోహరించి యంత్రంతో కొన్నింటిని కూల్చేసి, మరికొన్ని ఇళ్లను కూల్చేందుకు సిద్ధమవుతుండగా స్థానికులు అడ్డుకున్నప్పటికి నివాసాలను బలవంతంగా కూల్చేశారని వాపోయారు. దీనిపై గతంలో కోర్టులో వేసి స్టే కూడా తెచ్చుకున్నప్పటికీ అధికారులు కూల్చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇళ్లు  కూల్చిన ప్రాంతాన్ని టీడీపీ నాయకులు గంధం వెంకట్రాజు, బాబూరాజేంద్రప్రసాద్‌ తదతరులు సందర్శించారు. తహసీల్దార్‌ వెంకటేశ్వరరావును వివరణ కోరగా జగనన్న లేఅవుట్‌ నిమిత్తం రోడ్డు వేయడానికి ఇక్కడ కొన్ని నివాసాలు అడ్డుగా ఉన్న కారణంగా వారికి నోటీసులు అందించామని కాని ఆ నోటీసులు ఎవరూ తీసుకోలేదు. సర్వే నెంబరు 143కు సంబంధించి మాత్రమే కోర్టులో స్టే ఉందని తెలిపారు.

Updated Date - 2022-07-01T06:27:27+05:30 IST