
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతోంది. వివాహం తర్వాత కూడా ఇద్దరూ తమ తమ కెరీర్లపైనే దృష్టి సారించి వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. వెండితెర మీద దూసుకుపోతున్న రణ్వీర్ త్వరలో బుల్లితెర మీద కూడా సందడి చేయబోతున్నాడు. `ది బిగ్ పిక్చర్` పేరుతో రూపొందుతున్న ఓ క్విజ్ ప్రోగ్రామ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. టీవీ తెరపై రణ్వీర్కు ఇదే తొలి కార్యక్రమం.
ఆ కార్యక్రమం సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు రణ్వీర్ సమాధానాలు చెప్పాడు. దీపిక, రణ్వీర్ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటోను పంపించిన ఒక నెటిజన్.. `ఆ ఫొటో ఎక్కడ తీసుకున్నారు? అని అడిగాడు. ఆ ప్రశ్నకు రణ్వీర్ స్పందిస్తూ.. `ఆ ఫొటో గురించి నేను కచ్చితంగా సమాధానం చెప్పాలి. లేకపోతే ఇంటికి వెళ్లాక దీపిక నన్ను కొడుతుంది. మా తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఏదైనా ప్రత్యేక ప్రదేశాలకు వెళ్లాలనుకున్నాం. ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు చెందిన మేము ఆ రోజు రెండు ప్రాంతాల్లోని పవిత్ర స్థలాలకు వెళ్లాలనుకున్నాం. ముందుగా అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కు వెళ్లాం. అనంతరం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నామ`ని రణ్వీర్ చెప్పాడు.
