రూ.1335 కోట్లు సమీకరించిన ర్యాపిడో
ABN , First Publish Date - 2022-04-17T03:01:55+05:30 IST
న్యూఢిల్లీ : బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న బైక్ ట్యాక్సీ ప్లాట్ఫామ్ ర్యాపిడో.. ఫుడ్ టెక్ దిగ్గజం స్విగ్గీ నుంచి భారీ మొత్తంలో నిధులు సమీకరించింది.
న్యూఢిల్లీ : బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న బైక్ ట్యాక్సీ ప్లాట్ఫామ్ ర్యాపిడో.. ఫుడ్ టెక్ దిగ్గజం స్విగ్గీ నుంచి భారీ మొత్తంలో నిధులు సమీకరించింది. తాజా రౌండ్ సిరీస్-డీలో భాగంగా 175 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1335 కోట్లు) సమీకరించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ రౌండ్లో స్విగ్గీతోపాటు వెస్ట్బ్రిడ్జ్, టీవీఎస్ మోటార్, షెల్ వెంచర్స్, నెగ్జస్ వెంచర్స్ కూడా పెట్టుబడులు పెట్టాయి. కాగా గతేడాది ఆగస్టులో వెస్ట్బ్రిడ్జ్ కంపెనీ సారధ్యంలో జరిగిన ఫండ్స్ రౌండ్లో 52 మిలియన్ డాలర్లు సేకరించిన విషయం తెలిసిందే. తాజా సమీకరణతో కలిపి కంపెనీ మొత్తం వ్యాల్యూయేషన్ 800 మిలియన్ డాలర్ల మార్క్ను చేరుకుంది.
తాజాగా సమీకరించిన నిధులతో ర్యాపిడో టెక్నాలజీ, విస్తరణతోపాటు కంపెనీ సామర్థ్యాలను విస్తృతంగా పెంచుకోనున్నట్టు కంపెనీ తెలిపింది. మెట్రో సిటీలతోపాటు 1, 2, 3వ శ్రేణి నగరాలలో కూడా కస్టమర్ల అనుభూతిని మెరుగుపరచనున్నామని ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ఒక అధికారిక ప్రకటన చేసింది. ర్యాపిడో మరింత సురక్షితంగా, భద్రంగా, సరసమైన ధరల్లోనే ప్రత్యమ్నాయంగా నిలవనుందని కంపెనీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. మొత్తం మూడు కేటగిరీలు బైక్-ట్యాక్సీ, ఆటో, డెలివరీలలో నిధులను ఉపయోగించనున్నామని పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతున్న 100కిపైగా నగరాలలో కస్టమర్ల అనుభూతిని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. కాగా 25 మిలియన్లకుపై క్లయింట్లు, 1.5 కెప్టెన్ల(డ్రైవర్ పార్టనర్లు)తో కార్యకలాపాలను కొనసాగిస్తోంది.