కొండవీడు కోటలో అరుదైన మొక్క
ABN , First Publish Date - 2022-02-14T07:42:18+05:30 IST
కొండవీడు కోటలో అరుదైన మొక్క
భారత ఉపఖండంలోనే తొలిసారి గుర్తింపు
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 13: భారత ఉపఖండంలో ఎక్కడా కనిపించని అరుదైన మొక్కను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర పరిశోధకులు గుంటూరు జిల్లాలోని కొండవీడు కోటలో కనుగొన్నారు. ఎస్వీయూ వృక్షశాస్త్ర పరిశోధకుడు మొట్టా మహేంద్రనాథ్, పుణెలోని గోద్రేజ్ మొక్కల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మయూర్ నందికర్ ఈ మొక్కను కనిపెట్టారు. కొమెలీనాసియా కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం కొమెలీనా ఎరెక్టా. ఇది అత్యంత అరుదైన వృక్షజాతికి చెందినదని నిర్దారించారు. ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా పెరిగే ఈ మొక్కను భారత ఉపఖండంలో తొలిసారిగా గుర్తించినట్టు వారు చెప్పారు. సెప్టెంబరు, నవంబరు మాసాల్లో ఈ మొక్క పుష్పిస్తుందని పేర్కొన్నారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించే ‘నెలుంబో’ జర్నల్లో ఈ మొక్క సమగ్ర వివరాలు ప్రచురితమైనట్టు తెలిపారు. ఈ మొక్క వల్ల మానవ జాతికి కలిగే ప్రయోజనాల గురించి తాము అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు.