హైదరాబాద్ : తిరుమలగిరిలో అరుదైన ఆలయం

ABN , First Publish Date - 2021-02-19T15:27:30+05:30 IST

హైదరాబాద్ : తిరుమలగిరిలో అరుదైన ఆలయం

హైదరాబాద్ : తిరుమలగిరిలో అరుదైన ఆలయం

హైదరాబాద్‌లోని తిరుమలగిరిలోని సూర్య భగవాన్‌ ఆలయం అరుదైన వాటిలో ఒకటి. 70 ఏళ్లుగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఏటా రథసప్తమి (సూర్య జయంతి) వేడుకలు ఘనంగా జరుగుతాయి. కంటోన్మెంట్‌ నుంచే కాక నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రథసప్తమి రోజున ఇక్కడి వాతావరణం తిరునాళ్ళను తలపించేలా  ఉంటుంది.


హైదరాబాద్/తిరుమలగిరి : సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజున తెల్లవారుజామున స్వామిని పూలతో అలంకరించి ఉదయం 4 నుంచే పంచామృతాభిషేకాలు, అర్చనలు చేస్తారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణాలతో సౌర హోమం, అరుణ పారాయణం, సూర్య నమస్కారాలు ఉంటాయి. మకర సంక్రాంతి, రథసప్తమి రోజున మాత్రమే సౌర హోమం చేస్తారు. విశాల ప్రాంగణంలో ఉండే ఈ ఆలయంలో శివాలయం, సరస్వతి, నాగదేవత, సత్యనారాయణస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సమ్మక్క, సారలమ్మ గద్దెలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే సమ్మక్క, సారలమ్మ జాతర రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. సాధారణ రోజుల్లో ఉదయం 6 నుంచి 11 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 7.30 నిమిషాల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. రథ సప్తమి రోజున ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు.


అన్ని ఏర్పాట్లూ చేశాం

రథ సప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశాం. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చలువ పందిళ్లు, మంచి నీటి వసతి, కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక లైన్లు, శానిటైజర్లు ఏర్పాటు చేశాం. భక్తులు కూడా నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి రావాలి. - శివ శంకర్‌,  ఆలయ ధర్మకర్త.

Updated Date - 2021-02-19T15:27:30+05:30 IST