విమ్స్లో 13 ఏళ్ల బాలికకు అరుదైన చికిత్స
ABN , First Publish Date - 2022-05-29T06:19:22+05:30 IST
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు.
కడుపులో పేరుకుపోయిన వెంట్రుకలతో కూడిన పదార్థం తొలగింపు
విశాఖపట్నం, మే 28 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. బాలిక కడుపులో వెంట్రుకలతో పేరుకుపోయిన పదార్థాన్ని శస్త్ర చికిత్స చేసి తొలగించారు. వివరాలిలా ఉన్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన 13 ఏళ్ల చిన్నారి కొద్ది నెలలుగా కడుపునొప్పితో బాధ పడుతోంది. అనేక ఆస్పత్రులకు తిప్పినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఈ నెల 19న తల్లిదండ్రులు విమ్స్కు తీసుకువచ్చారు. చిన్నారికి వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించి ట్రైకోబెజోర్ (వెంట్రుకలతో కూడిన పదార్థం) కడుపులో వున్నట్టు గుర్తించారు. ఇటువంటి వాటిని గుర్తించడం కష్టమని, గత 50 ఏళ్లలో ఈ సమస్య 68 మందికి మాత్రమే వచ్చినట్టు వైద్యులు తెలిపారు. ట్రైకోబెజోర్ను గుర్తించిన వైద్యులు ల్యాప్రోస్కోపీ విధానంలో శస్త్ర చికిత్స చేసి బాలిక పొట్టలో వున్న పదార్థాన్ని తొలగించారు. తొలగించిన ఈ ట్రైకోబెజోర్ 300 గ్రాములు వున్నట్టు వైద్యులు వెల్లడించారు. విమ్స్లో ఈ బాలికకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ చికిత్స చేసినట్టు డైరెక్టర్ రాంబాబు తెలిపారు. సర్జికల్ గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ స్రవంతి బృందం ఆధ్వర్యంలో శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. శనివారం ఈ బాలికకు డిశ్చార్జి చేసినట్టు తెలిపారు.