పారదర్శకత, జవాబుదారీతనంతో రేషన్‌ సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2021-07-27T05:32:40+05:30 IST

అర్హులైన ప్రతి పేదవానికి రేషన్‌కార్డు జారీ చేసి ఎండీయూ వాహనాల ద్వారా నాణ్యమైన సరుకులు అందించడంలో పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్ద పీట వేస్తున్నామని ఇన్‌చార్జి కలెక్టర్‌ జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.

పారదర్శకత, జవాబుదారీతనంతో రేషన్‌ సరుకుల పంపిణీ
సమీక్ష నిర్వహిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ లక్ష్మీశ

కాకినాడ సిటీ, జూలై 26: అర్హులైన ప్రతి పేదవానికి రేషన్‌కార్డు జారీ చేసి ఎండీయూ వాహనాల ద్వారా నాణ్యమైన సరుకులు అందించడంలో పారదర్శకత, జవాబుదారీతనానికి   పెద్ద పీట వేస్తున్నామని ఇన్‌చార్జి కలెక్టర్‌ జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ  ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దేశ గడువులోపు వీలైనంత త్వరగా కార్డులకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరిస్తున్నామన్నారు. ఈకేవైసీ, సోషల్‌ ఆడిటింగ్‌ ప్రక్రియల్లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది చురుకైన పాత్ర పోషిస్తున్నారన్నారు. దీంతో  దరఖాస్తుల సత్వర పరిష్కారానికి వీలవుతుందన్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌ ద్వారా నిరంతరం పరిశీలిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి సందేహాలుంటే జిల్లా స్థాయి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అసవరమైన సూచనలు ఇస్తున్నామన్నారు. పేదల పంపిణీకి ఉద్దేశించిన బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్‌ కార్డు ముద్రణకు ఏర్పాటు చేశామన్నారు. అంగన్‌వాడీలు, పాఠశాలల్లో  మధ్యాహ్న భోజన పఽథకం అమలుకు పోషకాల పెంపు ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని అందిస్తున్నామని ఇన్‌చార్జి కలెక్టర్‌ వివరించారు. జిల్లాలో పర్యటించి పీడీఎస్‌పై ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చిన కేంద్ర బృందాన్ని అభినందించారు. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సీనియర్‌ కన్సల్టెంట్‌ కె.గిరిజాశంకర్‌, సీడీఈసీఎస్‌ టీమ్‌ లీడర్‌ రవి పారీక్‌ బృందం ఈ నెల 25,26 తేదీలలో కాకినాడ రూరల్‌, కరప మండలాల్లో స్టాక్‌ పాయింట్లు, రేషన్‌ డిపోలు సందర్శించి జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ పనితీరు బాగుందని కితాబిచ్చిందని సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌ ఇ.లక్ష్మీరెడ్డి, డీఎస్‌వో పి.ప్రసాదరావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె.రంగలక్ష్మీదేవి, బీసీ సంక్షేమ శాఖ డీడీ కె.మయూరి, ఐసీడీఎస్‌ పీడీ సత్యవాణి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T05:32:40+05:30 IST