రేషన్‌ సరుకుల్లో కోత

ABN , First Publish Date - 2022-06-30T07:43:38+05:30 IST

ఇప్పటికే మూడు నెలలుగా కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యానికి మంగళం పాడిన ప్రభుత్వం.. జూలై నెల పప్పు, తీపి కోటాలో కత్తిరించింది.

రేషన్‌ సరుకుల్లో కోత

జూలై నెల కోటాకన్నా తక్కువగా కేటాయింపు 

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 29: ఇప్పటికే మూడు నెలలుగా కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యానికి మంగళం పాడిన ప్రభుత్వం.. జూలై నెల పప్పు, తీపి కోటాలో కత్తిరించింది. దీంతో చక్కెర, కందిపప్పు కార్డుదారుల్లో అత్యధిక మందికి అందే అవకాశాలు లేవు. జిల్లాలో 5,30,816 కార్డుదారులుండగా 1379 చౌక దుకాణాల నుంచి ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతోంది. జూలై నెలకు కార్డుదారులకు పంపిణీ కోసం 8500 టన్నుల బియ్యం, 500 టన్నుల కందిపప్పు, 270 టన్నుల పంచదార కావాలి. అయితే ప్రభుత్వం బుధవారం నాటికి వంద టన్నుల పంచదార, 350 టన్నుల కందిపప్పు, 8325 టన్నుల బియ్యం మాత్రమే విడుదల చేసింది. వివిధ కారణాలతో ఇంకా 170 టన్నుల పంచదార, 150 టన్నుల కందిపప్పు, 175 టన్నుల బియ్యం కోటాలో కోత పడింది. ఈ క్రమంలో పౌరసరఫరాల సంస్థ అధికారులు.. ముందు డీడీ తీసిన డీలర్లకు ముందు ప్రాతిపదికన తమకు అందిన కోటాను అలాట్‌ చేసేశారు. మిగిలిన డీలర్లకు సరుకులు చేరలేదు. ప్రభుత్వం నిత్యవసర వస్తువుల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించని కారణంగా పూర్తిస్టాకు జిల్లాకు సరఫరా కాలేదని తెలుస్తోంది. కోటాకోతతో మెజార్టీ కార్డుదారులకు పంచదార, కందిపప్పు, బియ్యం జూలై నెలలో పూర్తిగా అందే అవకాశాలు కన్పించడం లేదు. జూలై నెల కోటా పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. 

Updated Date - 2022-06-30T07:43:38+05:30 IST