600 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-12-06T04:30:51+05:30 IST

దొనకొండ మండలంలోని చందవరం గ్రామంలోని నర్మదా రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 600 బస్తాల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

600 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత
రేషన్‌ బియ్యం పట్టుకున్న ఎస్సై ఫణిభూషణ్‌, డీటీ సురేష్‌

చందవరం రైస్‌మిల్లుపై పోలీసు, రెవెన్యూ అధికారుల దాడులు

దొనకొండ(చందవరం), డిసెంబరు 5 : మండలంలోని చందవరం గ్రామంలోని నర్మదా రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 600 బస్తాల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై బి.ఫణిభూషణ్‌ తన సిబ్బందితో, డిప్యూటీ తహసీల్దార్‌ పి.సురే్‌షబాబు, వీఆర్వో గాలిరెడ్డి శనివారం అర్ధరాత్రి ఈ మిల్లుపై దాడిచేశారు. రైసు మిల్లులో రేషన్‌ బియ్యం 50 కిలోల బస్తాలు 350, విడిగా మరో 250 బస్తాలను అధికారులు గుర్తించారు. రైస్‌మిల్లు యజమాని ఓబుల్‌రెడ్డిని విచారించగా చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసుకున్నట్లు అంగీకరించారన్నారు. వాటిని పాలిష్‌ చేసి నాణ్యమైన బియ్యంలో కలిపి కృష్ణపట్నం తదితర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయించేందుకు రైస్‌మిల్లులో నిల్వ ఉంచినట్లు తెలిపారన్నారు. ఈగల్‌ బ్రాండ్‌తో వీటిని ప్యాక్‌ చేసినట్లు తెలిపారు. మొత్తం 600 బస్తాలకు చెందిన 30 టన్నుల బియ్యం విలువ రూ.3,90,000 ఉంటుందని అధికారులు నిర్దారించారు.  రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రైస్‌మిల్లును సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. యజమాని ఓబుల్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫణిభూషణ్‌ చెప్పారు.

Updated Date - 2021-12-06T04:30:51+05:30 IST