అమరావతి : సీనియర్ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం రావెల కిషోర్ బాబు బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా (Resignation) లేఖను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు (Somu Veerraju) పంపారు. గత నాలుగు నెలలుగా బీజేపీలో (BJP) రావెల క్రియాశీలకంగా లేరు. అయితే తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాననే విషయాలను సైతం ఆయన వివరించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు రావెల ప్రకటించారు. కాగా.. కిషోర్ బాబు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి

ఇదీ రావెల పరిస్థితి..
ఇదిలా ఉంటే.. ఐఆర్ఎస్ (IRS) అధికారిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ (Telugudesam) తరఫున పోటీచేసి గెలిచారు. అంతేకాదు.. ఎవరూ ఊహించని రీతిలో ఆయన్ను సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి వరించింది. అయితే మంత్రిపదవి దక్కించుకున్న కొన్ని రోజుల తర్వాత గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్మన్ జానీమూన్తో వివాదంతో పాటు పలు కారణాల రీత్యా అప్పటి చంద్రబాబు (Chandrababu) కేబినెట్ విస్తరణతో రావెల మంత్రి పదవి పోయింది.
2019 ఎన్నికలకు ముందు టీడీపీ టాటా చెప్పేసిన రావెల.. జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత మళ్లీ అదే నియోజకవర్గం నుంచే జనసేన తరఫున రావెల పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే లోలోపల ఏం జరిగిందో తెలియదు కానీ.. జనసేనకు ఆయన గుడ్ బై చెప్పేసి.. ఈసారి జాతీయ పార్టీ అయిన బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు. ఈ పార్టీలో కూడా ఈయన చాలా రోజులు ఉండలేదు. ఇవాళ బీజేపీకి కూడా రాం రాం చెప్పేశారు. అయితే.. ఈయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? రాజకీయాల్లో ఉంటారా..? దూరంగా ఉండిపోతారా..? లేకుంటే వేరే పార్టీలో ఏమైనా చేరుతారా..? అని రావెల అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆందోళనలో ఉన్నారు. అయితే త్వరలో జరగనున్న మహానాడులో రావెల మళ్లీ టీడీపీకే వస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో నిజానిజాలెంతో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.