రాజ్యసభ ఉప ఎన్నికకు రవిచంద్ర ఏకగ్రీవం

ABN , First Publish Date - 2022-05-24T09:49:56+05:30 IST

రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాజ్యసభ ఉప ఎన్నికకు రవిచంద్ర ఏకగ్రీవం

  • రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ
  • రెండు రాజ్యసభ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు


హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. రవిచంద్ర నామినేషన్‌  మాత్రమే మిగిలి ఉండటంతో ఆయన అభ్యర్థిత్వం ఏకగ్రీవమైంది. ఈ మేరకు రాజ్యసభ సభ్యునిగా ఆయన ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్రను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌,  రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ తదితరులు అభినందించారు. వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తనకు ప్రాధాన్యమిచ్చి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. 


తెలంగాణ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల నిర్వహణకు మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివా్‌సల పదవీ కాలం జూన్‌ 21న ముగియనుండటంతో ఈ ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈనెల 31 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, జూన్‌ 1న నామినేషన్ల పరిశీలన, మూడో తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువుగా విధించారు. కాగా ఈ రెండు స్థానాలకు సంబంధించి అధికార టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థులుగా డి.దామోదర్‌రావు, బి. పార్థసారధి రెడ్డి పేర్లను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-05-24T09:49:56+05:30 IST