కక్ష సాధింపుతోనే వర్సిటీ పేరు మార్పు : కొల్లు రవీంద్ర
ABN , First Publish Date - 2022-09-27T07:05:04+05:30 IST
ఎన్టీఆర్ సిద్ధాంతాలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేందుకు సీఎం జగన్రెడ్డి యోచిస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు
- బందరులో రిలే నిరాహార దీక్షలు
మచిలీపట్నం టౌన్, సెప్టెంబరు 26 : ఎన్టీఆర్ సిద్ధాంతాలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేందుకు సీఎం జగన్రెడ్డి యోచిస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. అఖిల భారత ఎన్టీఆర్ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కొనసాగించాలని పేర్కొంటూ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు మన్నే సోమేశ్వరరావు, నాయకులు మెట్టు సూరిబాబు, పి.హరి వెంకటేశ్వరరావు, పి.శ్రీరామ్, ఎస్.నాంచారయ్య, బి.గణపతి, ఎం.సత్యనారాయణ, ఎం.ఆంజనేయులు, అక్బర్ ఆలీ, శ్రీను తదితరులు దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించి ప్రసంగించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన హెల్త్ యూనివర్సిటీకి 1998లో చంద్రబాబు ఎన్టీఆర్ పేరు పెట్టారన్నారు. ఎన్టీఆర్ పేరు మారిస్తే రాష్ట్రమంతటా అభిమానులు ఉద్యమిస్తారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ, 24 ఏళ్ల తరువాత వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును మార్చడం వింతగా ఉందన్నారు. మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు మన్నే సోమేశ్వరరావు, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టీడీపీ నగర కార్యదర్శి పిప్పళ్ళ వెంకన్న, ఎస్. నాంచారయ్య, కుంచే నాని, ఐ.దిలీప్, ఇలియాస్ పాషా, తలారి సోమశేఖర్, లంకిశెట్టి నీరజ, వసంతకుమారి, నాగమ్మ తదితరులు సంఘీబావం తెలిపారు.