రాయపూడి ఎత్తిపోతల పైపులు చోరీ
ABN , First Publish Date - 2022-10-07T09:03:27+05:30 IST
రాయపూడి ఎత్తిపోతల పైపులు చోరీ
యథేచ్ఛగా తవ్వి.. ట్రాక్టర్లలో తరలింపు
ఒక్కో పైపు ధర రూ.50 వేలు
150 వరకు పైపుల అపహరణ
పోలీసుల అదుపులో ఇద్దరు
4 పైపులు, ట్రాక్టర్, జే సీబీ స్వాధీనం
మిగిలిన పైపులూ రికవరీకి చర్యలు
తుళ్ళూరు, అక్టోబరు 6: రాజధాని అమరావతిలో ఎత్తిపోతల పథకానికి సంబంధించిన విలువైన సిమెంట్ పైపులనూ చోరీ చేసి యథేచ్ఛగా తరలించుకుపోతోన్నారు. ఇప్పటికే రాజధానిలో రోడ్లు తవ్వేసి మెటీరియల్ తరలించి జేబులు నింపుకుంటున్న విషయం తెలిసిందే. రాయపూడి ఎత్తిపోతల పథకం పైపులనూ తవ్వి తీసి తరలించేస్తున్నారు. నాలుగు భారీ పైపులు, వాటిని తరలిస్తున్న ట్రాక్టర్, ఎక్స్కవేటర్లనూ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తుళ్లూరు సీఐ ఆనందరావు తెలిపారు. 2001వ సంత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాయపూడి ఎత్తిపోతల పథకాన్ని రూ.14 కోట్లతో పూర్తి చేసి, దాదాపు 5వేల ఎకరాలకు సాగు నీరు అందించింది. రాష్ట్రం విడిపోయిన తరువాత రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు భూములిచ్చారు. ఎత్తిపోతల పథకానికి చెందిన భూములను కూడా సీఆర్డీఏకి అందజేశారు. వ్యవసాయం లేకపోవటంతో ఈ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారింది. దీంతో ఆ పైపులను దొంగిలిస్తున్నారు. ఒక్కో పైపు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుందని రైతులు తెలిపారు. దాదాపు వంద నుంచి నూట యాభై వరకు పైపులు తరలించేసినట్టు సమాచారం. వాటిని కూడా రికవరీ చేసే పనిలో పోలీసులున్నారు.